పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించండి : ఎస్పీ డి.జానకి

పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించండి : ఎస్పీ డి.జానకి

పాలమూరు, వెలుగు: పెండింగ్​కేసులను త్వరగా పరిష్కరించాలని ఎస్పీ డి.జానకి ఆదేశించారు. ఆధునిక సాంకేతిక వినియోగించి, సాక్ష్యాధారాలు సేకరించాలని చెప్పారు. మంగళవారం జిల్లా పోలీస్ ​కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల్లో విచారణ వేగవంతం చేయాలన్నారు.  గంజాయి రవాణా, జూదం, పీడీఎస్ బియ్యం తరలింపు, ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఏఎస్పీ  రత్నం, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణా రెడ్డి, సీఐలు పాల్గొన్నారు.  

మోడిఫైడ్ ​సైలెన్సర్లు ధ్వంసం  

మహబూబ్ నగర్ జిల్లాలో పట్టుకున్న155 మోడిఫైడ్ సైలెన్సర్లను ఎస్పీ జానకి మంగళవాకం  రోడ్డు రోలర్ తో ధ్వంసం చేయించారు. మోటార్ ​వాహనాల చట్టం ప్రకారం.. సైలెన్సర్లకు మార్పులు చేసేవారిపై కేసు నమోదు చేసి, జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. మార్పులు చేస్తే మెకానిక్​ల పైనా చర్యలు తీసుకుంటామన్నారు.  డీఎస్పీ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఇన్​స్పెర్ భగవంత్ రెడ్డి, మహబూబ్ నగర్ రూరల్ ఎస్సై విజయ్ కుమార్ ఉన్నారు.

నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

గద్వాల, వెలుగు: కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు కృష్ణా, తుంగభద్ర నదులకు వరద ప్రవాహం పెరుగుతోందని ఎస్పీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నదీ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చేపలు పట్టేవారు, పశువులు, గొర్రెల కాపరులు, రైతులు నదిలోకి వెళ్లవద్దన్నారు. పోలీస్​ అధికారులు గ్రామాల్లో దండోరా వేయించాలని ఆదేశించారు.

మానవ అక్రమ రవాణా నేరం

వనపర్తి, వెలుగు: మానవ అక్రమ రవాణా తీవ్రమైన నేరమని, అధికారులు సమష్టి కృషితో అడ్డుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ చెప్పారు.  ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా పోలీస్​కార్యాలయంలో డిస్ట్రిక్ట్​ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణాపై సమాచారం తెలిస్తే ఉమెన్ హెల్ప్ లైన్ 181, చైల్డ్ లైన్ 1098, డయల్ 100, 112 కు ఫోన్​చేయాలని సూచించారు.

 2022లో తల్లిదండ్రులు చనిపోవడంతో  చదువు మానేసిన మహేశ్​ను సొసైటీ అధ్యక్షురాలు చిన్నమ థామస్, ఆపరేషన్ ముస్కాన్ టీం చేరదీసింది. అతన్ని  పాఠశాలలో చేర్పించగా ఈ ఏడాది పదోతరగతిలో 480 మార్కులు సాధించాడు. మహేశ్​ను ఎస్పీ సన్మానించారు.  డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, డీఎంహెచ్​వో  శ్రీనివాసులు, జస్టిస్ జువెనైల్ బోర్డు మెంబర్ గిరిజ, మానసిక వైద్యురాలు పుష్పలత తదితరులున్నారు.