
హసన్పర్తి, వెలుగు: ఎస్సార్ యూనివర్సిటీ స్టూడెంట్ యల్లా కృష్ణవేణిని భారీ ప్యాకేజీ వరించింది. కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ కు చెందిన ఆమె రూ. 34.4 లక్షల ప్యాకేజీని కైవసం చేసుకుంది. సో మవారం ఈ మేరకు వైస్ చాన్స్ లర్ డాక్టర్ దీపక్ గార్గ్, రిజిస్ట్రార్ అర్చనా రెడ్డి, డీన్ ఫ్యాకల్టీ డాక్టర్ వి. మహేశ్, ప్లేస్ మెంట్ డైరెక్టర్ శ్రీ గురు చరణ్సింగ్ ప్లేస్ మెంట్ నివేదికని వర్సిటీ ప్రాంగణంలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా వీసీ మాట్లాడారు. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసి వారిని ఉన్నత స్థాయికి చేర్చడంలో ఎస్సార్ యూనివర్సిటీ ముందుంటుందని పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 896 మంది విద్యార్థులు వివిధ కంపెనీలలో ప్లేస్ మెంట్లను పొందారని వివరించారు. స్టూడెంట్స్ కు ఏడాదికి సగటున రూ.5.8లక్షల ప్యాకేజీ లభించిందని వెల్లడించారు. యాక్సెంచర్, ఎయిర్ టెల్, బాష్, క్యాటర్ పిల్లర్, కాగ్నిజెంట్, హెచ్ సీఎల్, ఇన్ఫోసిస్, పే పాల్ ఈ ఏడాది స్టూడెంట్స్ కు ప్లేస్ మెంట్స్ ఇచ్చాయన్నారు. ఈ సందర్భంగా కృష్ణవేణితో పాటు ప్లేస్ మెంట్స్ సాధించిన స్టూడెంట్స్ ను డాక్టర్ అర్చనా రెడ్డి, వి.మహేశ్, శ్రీ గురు చరణ్ సింగ్ అభినందించారు.