
- ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ సొంతం
- మిక్స్డ్ రిలేలో ఇండియాకు గోల్డ్
బ్యాంకాక్: ఇండియా స్టార్ అథ్లెట్, లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ రెండోసారి ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్లో సత్తా చాటి పారిస్ బెర్తు దక్కించుకున్నాడు. శనివారం జరిగిన మెన్స్ లాంగ్ జంప్లో శ్రీశంకర్ చివరి ప్రయత్నంలో 8.37 మీటర్ల దూరం దూకి రెండో ప్లేస్తో సిల్వర్ను సొంతం చేసుకున్నాడు. ఒలింపిక్స్ క్వాలిఫై మార్క్ 8.27 మీటర్ల దూరాన్ని ఇండియన్ అథ్లెట్ ఈజీగా అధిగమించాడు. తద్వారా పారిస్ ఒలింపిక్స్ బెర్త్ను ఖాయం చేసుకున్నాడు. దీంతో ఇండియా నుంచి ట్రాక్ అండ్ ఫీల్డ్లో పారిస్ బెర్త్ సాధించిన తొలి ప్లేయర్గా రికార్డులకెక్కాడు. ఇది వరకు టోక్యో ఒలింపిక్స్లో బరిలోకి దిగిన శ్రీశంకర్ క్వాలిఫయింగ్లోనే ఇంటిముఖం పట్టాడు. 20 కిలో మీటర్ల వాక్లో ఇప్పటికే అక్ష్దీప్ సింగ్, వికాస్ సింగ్, పరమ్జీత్ సింగ్ బిస్త్, ప్రియాంక గోస్వామి పారిస్ బెర్త్ను దక్కించుకున్నారు. మిక్స్డ్ 4X400 మీటర్ల రేస్లో రాజేశ్ రమేశ్, ఐశ్వర్య మిశ్రా, అమోజ్ జాకబ్, శుభ వెంకటేషన్ 3ని.14.70 సెకన్లలో లక్ష్యాన్ని చేరి గోల్డ్ మెడల్ను గెలుచుకున్నారు. మెన్స్ హైజంప్లో సర్వేశ్ అనిల్ కుశారె, హెప్టాథ్లాన్లో స్వప్నా బర్మన్ సిల్వర్ మెడల్స్తో మెరిశారు. మెన్స్ 400 మీటర్ల హర్డిల్స్లో సంతోష్ కుమార్ 49.09 సెకన్లతో బ్రాంజ్ మెడల్ను సాధించాడు. ఓవరాల్గా ఇప్పటి వరకు ఇండియా 14 (6 గోల్డ్, 4 సిల్వర్, 4 బ్రాంజ్) మెడల్స్ను కైవసం చేసుకుంది.