సాక్షాత్తు విష్ణుమూర్తి దశావతారాల్లో ఏడవ అవతారంగా భూలోకంలో దశరథ మహారాజు.. కౌసల్య దంపతులకు కారణ జన్ముడిగా శ్రీరామచంద్రుడు జన్మించాడు. విధ్యాభ్యాసం అనంతరం.. జనక మహారాజు కుమార్తె సీతాదేవిని స్వయంవరం ద్వారా పెళ్లి చేసుకున్నాడు. సీతారాముల కళ్యాణం లోకళ్యాణార్దంగా రూపుదిద్దుకుంది. అంతటిమహోత్తరమైన కళ్యాణం త్రేతా యుగంలోఎక్కడ జరిగింది.. ఆ స్థల పురాణం ఏమిటి.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
దేశ వ్యాప్తంగా ఈ రోజు (మార్చి 27)న జరుగుతున్న కళ్యాణం త్రేతాయుగంలో సీతమ్మ తల్లి పుట్టిల్లు మిథిలా రాజ్యం.. జానకీ మందిర్ లో జరిగిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. నేపాల్లోని జనక్పూర్ లో నెలవైన ఆలయం ఉంది. ఆ జగదానంద కారకుడి పట్టమహిషి కొలువైన మందిరం స్థలపురాణం ప్రకారం జనక మహారాజు ఏలిన నేలగా ప్రసిద్ది చెందింది
సీతమ్మతల్లి జనకుడికి లభ్యమైన చోటు ఇదేనని.. రామయ్యను పెళ్లాడి అయోధ్యకు వెళ్లేదాకా ఈ నేలపైనే నడయాడిందని పురాణాల ఇతిహాసాల ద్వారా తెలుస్తుంది. 1657లో ఈ ప్రాంతంలో ఒక స్వర్ణ సీత విగ్రహం దొరికింది. ఈ ఆలయానికి సమీపంలో ‘వివాహ మండప్’ పేరుతో ఒక గుడి ఉంటుంది.
సీతారాముల పెళ్లి జరిగింది అక్కడేనని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. జానకీ మందిర్ను నేపాలీలు ...నౌ లఖా మందిర్.. గా వ్యవహరిస్తుంటారు. నౌ లఖా అంటే తొమ్మిది లక్షలు. 150 అడుగుల ఎత్తుండే ఈ మూడంతస్తుల గుడిలో 60 గదులుంటాయి. 1910లో రాణి వృషభాను దీన్ని నిర్మింపజేశారు. ఈ ఆలయ నిర్మాణానికిఅయిన ఖర్చు..అప్పట్లో రూ. 9,99,900. అందుకే .. నౌ లఖా మందిర్.. అనే పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని సందర్శించేందుకు నేపాల్ నలుమూలల నుంచే కాక.. భారత్, శ్రీలంక తదితర దేశాల నుంచి వేలాది భక్తులు వస్తుంటారు. శ్రీరామనవమి రోజు అక్కడ ఎంతో వైభవంగా కళ్యాణం జరిపిస్తారు.
