
- 70 టీఎంసీలకు చేరువలో
- శ్రీరాంసాగర్ నీటిమట్టం
బాల్కొండ, వెలుగు : గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు భారీ ఇన్ఫ్లో వస్తోంది. ఎగువ నుంచి 1,51,806 క్యూసెక్కుల వరద వస్తుండడంతో ప్రాజెక్ట్లో నీటి నిల్వ 67 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం1091 అడుగులు కాగా, ఆదివారం సాయంత్రానికి 1086.90 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. వరద కాల్వ హెడ్ రెగ్యులేటర్ నుంచి 10 వేల క్యూసెక్కులు, కాకతీయ కెనాల్కు ఐదు వేల క్యూసెక్కులు, అలీసాగర్కు 180 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న జల విద్యుత్ కేంద్రంలో 9 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని డీఈ శ్రీనివాస్ తెలిపారు.
గోదావరికి కొనసాగుతున్న వరద
భద్రాచలం, వెలుగు : భారీ వర్షాల నేపథ్యంలో గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి దశల వారీగా నీటిని విడుదల చేస్తుండడంతో ఆదివారం సాయంత్రానికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 35 అడుగులు చేరుకుంది. ఆరు లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్ట్ ఐదు గేట్లు ఎత్తి 5,671 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి రిలీజ్ చేస్తున్నారు. భద్రాద్రి జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ అయిన నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ సూచించారు. అన్ని మండలాల ఆఫీసర్లు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. ఆశ్రమ స్కూళ్ల హెచ్ఎంలు, వార్డెన్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, స్టూడెంట్లను బయటకు పంపొద్దని చెప్పారు. అత్యవసరమైతే కొత్తగూడెం కలెక్టరేట్ నంబర్ 08744 241950, 93929 1974, భద్రాచలం ఐటీడీఏ కంట్రోల్ రూం నంబర్ 79952 68352, సబ్ కలెక్టర్ ఆఫీస్ 08743 -232444, 93479 10737 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.