
ఫీజు కొంచెం లేట్అయిందనుకోండి.. స్కూలోళ్లు ఏం చేస్తారు? స్టూడెంట్ ఇంటికి నోట్ పంపుతారు. అప్పటికీ కట్టలేదనుకోండి.. పిల్లలను క్లాసు బయట నిలబెడతారు. అయినా కట్టకపోతే, స్కూలుకే రానివ్వరు. కానీ, పంజాబ్ లూధియానాలోని ఓ స్కూల్ ఇదిగో ఇలా చేసింది. చెయ్యిపై స్టాంపేసి పంపింది. అతడిది, అతడి అక్కది పెండింగ్ ఫీజులు కట్టాలంటూ వాళ్ల తల్లిదండ్రులకు ఇలా నోట్ పంపింది.
ఎస్డీఎన్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్న హర్ష్దీప్ సింగ్ అనే స్టూడెంట్కు శుక్రవారం ఈ చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా విద్యాశాఖ అధికారులు, విచారణకు ఆదేశించారు. ఏప్రిల్, మే నెల ఫీజు ₹760, ఈ మధ్యే స్కూల్లో పదో తరగతి పూర్తి చేసిన అతడి అక్క పెండింగ్ ఫీజు ₹6,805 కట్టాలంటూ స్టాంప్ వేసింది స్కూల్ యాజమాన్యం. పరీక్షలుండడంతో బ్యాగ్ తెచ్చుకోలేదని, దీంతో వేరే పేపర్ మీదో, లేదా క్వశ్చన్ పేపర్ మీదో నోట్ రాయకుండా తన ఎడమ చెయ్యిపై ఫీజ్ రిమైండర్ స్టాంప్ వేశారని ఆ విద్యార్థి చెప్పారు.
మే 25న ఫీజు మొత్తం కట్టేస్తామని స్కూలు యాజమాన్యానికి చెప్పినా ఇలాంటి పని చేయడం చాలా అవమానంగా ఉందని ఆ అబ్బాయి తండ్రి కుల్దీప్ సింగ్ అన్నాడు. ఆటో నడుపుకునే తాను రోజుకు ₹300 సంపాదిస్తున్నానని, తన పెద్ద కొడుకు ఉద్యోగం చేస్తుంటాడని, ప్రతి నెలా 25న అతడికి జీతం వస్తుందని, ఆ రోజు డబ్బు కట్టేస్తామంటూ స్కూలుకు చెప్పామని అతడు చెప్పాడు. ఫీజు పెండింగ్ ఉంటే తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడేదుండేనని అన్నాడు. ఈ ఘటనను స్కూలు ప్రిన్సిపాల్ షమా దుగ్గల్ సమర్థించుకున్నారు. ఎప్పుడు ఫీజు అడిగినా కట్టలేదని చెప్పారు. ఎన్నో సార్లు రిమైండర్లు పంపామని చెప్పారు. ఈ స్టాంప్ ఈజీగానే చెరిగిపోతుందని, కానీ, అతడి తల్లిదండ్రులొచ్చి తనపై దౌర్జన్యం చేశారని ఆమె అన్నారు