
- మోకాలి గాయంతో వైదొలిగిన రెజ్లర్
- ఆమె స్థానంలో అంతిమ్ పంగల్కు చాన్స్
- 17న వినేశ్కు ముంబైలో సర్జరీ
న్యూఢిల్లీ: ఆసియా గేమ్స్కు ముందు ఇండియా రెజ్లింగ్ టీమ్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గోల్డ్ మెడల్ఫేవరెట్, స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ (53 కేజీ) ఎడమ మోకాలి గాయం కారణంగా మెగా ఈవెంట్కు దూరమైంది. దీంతో రిజర్వ్లో ఉన్న అంతిమ్ ఫంగల్కు లైన్ క్లియర్ అయ్యింది. ఈ నెల 13న గాయపడిన వినేశ్ 17న ముంబైలో సర్జరీ చేయించుకోనున్నట్లు మంగళవారం ట్వీట్ చేసింది. 2018 ఆసియా గేమ్స్లో వినేశ్ గోల్డ్ మెడల్ నెగ్గింది. అయితే, సర్జరీ కారణంగా ఈ నెల 25, 26న జరిగే వరల్డ్ చాంపియన్షిప్ ట్రయల్స్కు కూడా దూరం కానుంది. దాంతో, ఒలింపిక్ బెర్తులు లభించే వరల్డ్ చాంపియన్షిప్స్లోనూ ఆమె పాల్గొనే చాన్స్ లేనట్టే. ‘రెండు రోజుల కిందట నా ఎడమ మోకాలికి గాయమైంది. స్కాన్స్, రిపోర్ట్స్ను పరిశీలించిన తర్వాత ఆపరేషన్ తప్పదని డాక్టర్లు తేల్చారు. నేను పూర్తి స్థాయిలో కోలుకోవడానికి సర్జరీ తప్ప మరో మార్గం కనిపించడం లేదు’ అని వినేశ్ పేర్కొంది. సెప్టెంబర్ 23 నుంచి ఆసియా గేమ్స్ హాంగ్జౌలో జరగనున్నాయి.
ట్రయల్స్పై వివాదం..
లైంగిక ఆరోపణల కేసులో డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా పోరాడుతున్న వినేశ్కు ఆసియా గేమ్స్ ట్రయల్స్ నుంచి మినహాయింపు ఇవ్వడంపై చాలా దుమారం రేగింది. 53 కేజీ ట్రయల్స్లో అంతిమ్ పంగల్ విన్నర్గా నిలిచినా అమెను రిజర్వ్లో పెట్టి వినేశ్కు డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చారు. దీనిపై అంతిమ్ కోర్టు మెట్లెక్కింది. అయితే హైకోర్టు ఈ పిల్ను కొట్టి వేయడంతో 28 ఏళ్ల వినేశ్కు లైన్ క్లియర్ అయినా ఇప్పుడు గాయం రూపంలో ఆమెకు దురదృష్టం ఎదురైంది. 2018 జకర్తాలో నెగ్గిన గోల్డ్ను ఈసారి కూడా నిలబెట్టుకోవాలన్నది తన కల అని వినేశ్ వ్యాఖ్యానించింది. కానీ గాయం తన కలను దెబ్బకొట్టిందని తెలిపింది.