![డబ్ల్యూఎఫ్ఐ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్పై లైంగిక ఆరోపణలు](https://static.v6velugu.com/uploads/2023/01/Vinesh-Pogat_OMYneqx8wA.jpg)
న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై.. స్టార్ రెజ్లర్ వినేశ్ పోగట్ సంచలన ఆరోపణలు చేసింది. చాలా ఏళ్ల నుంచి అతను విమెన్ రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించింది. లక్నోలో జరిగిన నేషనల్ క్యాంప్లోనూ కొంత మంది కోచ్లు మహిళా రెజ్లర్లను వేధించారని తెలిపింది. అయితే తాను ఇలాంటి వేధింపులకు ఎప్పుడూ గురికాలేదని స్పష్టం చేసింది. ‘టోక్యో గేమ్స్ ముగిసిన తర్వాత రెజ్లింగ్లో నెలకొన్న ఇష్యూస్పై నేను ప్రధానిని కలవాలనుకున్నా. కానీ ప్రెసిడెంట్కు సన్నిహితంగా ఉండే వ్యక్తుల నుంచి నాకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. నన్ను చంపేస్తామని బెదించారు. ప్రెసిడెంట్ లైంగిక వేధింపులపై 10, 20 మంది రెజ్లర్లు నన్ను కలిశారు. చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు వాళ్ల పేర్లు బయటకు చెప్పలేను. కానీ పీఎం, హోం మినిస్టర్ను కలిసినప్పుడు కచ్చితంగా బహిర్గతం చేస్తా. ఈ ధర్నాలో పాల్గొన్న వారికి ఏదైనా జరిగితే దానికి బాధ్యుడు బ్రిజ్ భూషణే అవుతాడు’ అని బుధవారం జంతర్మంతర్ వద్ద నాలుగు గంటల పాటు ధర్నా చేసిన తర్వాత వినేశ్ మీడియాతో వ్యాఖ్యానించింది.
స్టార్లు బజ్రంగ్ పునియా, సాక్షి మాలిక్, సరితా మోరె, సంగీతా పోగట్, అన్షు మాలిక్, సోనమ్ మాలిక్, సత్యవర్త్ మాలిక్ సహా 30 మంది రెజ్లర్లు ఈ ధర్నాలో పాల్గొన్నారు. 2019లో డబ్ల్యూఎఫ్ఐ ప్రెసిడెంట్గా బ్రిజ్ భూషణ్ వరుసగా మూడోసారి ఎన్నికయ్యాడు. రెజ్లింగ్ ఫెడరేషన్ను పూర్తి ఏకపక్షంగా నడిపిస్తున్నారని, ఇది ఇలాగే కొనసాగితే తాము ఏ ఇంటర్నేషనల్ టోర్నీలో పాల్గొనబోమని బజ్రంగ్ పూనియా హెచ్చరించాడు. డిక్టేటర్గా వ్యవహరిస్తున్న అతన్ని తక్షణమే తొలగించాలన్నాడు.