అఫ్గాన్ లో ఆకలి కేకలు.. అవయవాలు అమ్ముకుంటున్రు

అఫ్గాన్ లో ఆకలి కేకలు.. అవయవాలు అమ్ముకుంటున్రు
  • ఆకలి తట్టుకోలేక అఫ్గాన్ల అవస్థలు
  • 2.3 కోట్ల మంది తిండి లేక మాడుతున్నరు
  • సాయం కోసం డబ్ల్యూఎఫ్​పీ చీఫ్ విజ్ఞప్తి

బెర్లీన్: తాలిబాన్ల పాలనలోని అఫ్గానిస్తాన్ లో ఆహార సంక్షోభం మరింత తీవ్రమైంది. కరోనా, కరువు, ఆర్థిక సంక్షోభంతో ఆ దేశం అల్లాడుతోంది. సగం కంటే ఎక్కువ జనాభా ఆకలితో అలమటిస్తోంది. ఆ దేశ ప్రజలు ఆకలి తీర్చుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లలను, పిల్లల అవయవాలను అమ్ముకుంటున్నారని యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (డబ్ల్యూఎఫ్ పీ) చీఫ్​డేవిడ్ బీస్లీ ఆవేదన వ్యక్తం చేశారు. అఫ్గాన్ లో తనను కలిసిన ఒక మహిళ తన బిడ్డను బలవంతంగా మరో ఫ్యామిలీకి అమ్ముకుందని చెప్పారు. జర్మనీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డేవిడ్ ఈ విషయాలు వెల్లడించారు. అఫ్గాన్ ఇప్పుడు ఘోరమైన విపత్తును ఎదుర్కొంటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని 4 కోట్ల జనాభాలో 2.3 కోట్ల మంది ఆకలితో అల్లాడుతున్నారని తెలిపారు. 

సాయం చేయాలని బిలియనీర్లకు పిలుపు... 

అఫ్గాన్ ఇప్పటికే ప్రపంచ పేద దేశాల్లో ఒకటని, దాదాపు 20 ఏండ్ల నుంచి తాలిబాన్లతో పోరాటం చేస్తోందని డేవిడ్ గుర్తు చేశారు. మానవతా దృక్పథంతో అఫ్గానిస్తాన్​ను ఆదుకోవాలని ప్రపంచ దేశాలకు మరోసారి విజ్ఞప్తి చేశారు. కరోనా టైమ్ లో ప్రపంచ బిలియనీర్లు చాలా సంపాదించారని, వారందరి ఒక్కరోజు సంపాదనను ఇస్తే.. అఫ్గాన్ లో అందరి ఆకలి తీర్చవచ్చని చెప్పారు. బిలియనీర్లు సాయం చేయాలని  పిలుపునిచ్చారు.

మన దేశం నుంచి 3 టన్నుల మందులు..

అఫ్గాన్​కు మనదేశం మరోసారి మందులు పంపింది. 3 టన్నుల మెడిసిన్స్ ను కాబూల్​లోని ఇందిరాగాంధీ హాస్పిటల్​కు అందించినట్లు విదేశాంగ శాఖ శనివారం తెలిపింది.