క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి

హైదరాబాద్: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ వేడుకల్లో భాగంగా జింఖానా గ్రౌండ్ లో పోలీస్, జీహెచ్ఎంసీ, డాక్టర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన  క్రికెట్ పోటీలను మంత్రి ప్రారంభించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ... క్రీడల వల్ల ఆరోగ్యంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయన్నారు.  

ప్రతి ఒక్కరూ చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. పిల్లలు క్రీడారంగంలో ఎదిగేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని, గెలుపు ఓటములను పట్టించుకోకుండా క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. క్రీడల్లో ముందుకు సాగాలంటే సాధననే ముఖ్యమని తెలిపారు.