
- రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిత్
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేసి రిటైర్ అయిన ఉద్యోగుల పెండింగ్ పెన్షన్లు, జీపీఎఫ్ ఫైనల్ విత్ డ్రా కేసులను పరిష్కరించేందుకు పెన్షన్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిత్ తెలిపారు. శుక్రవారం మహబూబ్ నగర్ కలెక్టరేట్ లో నిర్వహించిన పెన్షన్, జీపీఎఫ్ అదాలత్లో కలెక్టర్ విజయేందిర బోయితో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు, జీపీఎఫ్ విషయంలో ఏమైనా అనుమానాలు ఉంటే అదాలాత్ లో నివృత్తి చేసుకోవాలని సూచించారు.
ఉద్యోగుల పెన్షన్, జీపీఎఫ్ పత్రాలు అందిన వెంటనే పరిశీలించి మంజూరు చేస్తామని చెప్పారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన అదాలత్ను మహబూబ్ నగర్ కలెక్టరేట్లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ పదవీ విరమణ చేసిన రోజునే ఉద్యోగులకు పెన్షన్ ఉత్తర్వులు అందేలా చూడాలని కోరారు.
116 ప్రభుత్వ శాఖల అధికారులు, 50 మంది పెన్షనర్లు, 28 మంది చందా దారులు, పెన్షనర్ అసోసియేషన్ ప్రతినిధులు హాజరయ్యారు. అనంతరం 20 మందికి పెన్షన్ మంజూరు పత్రాలు, 16 మందికి జీపీఎఫ్ ఆథరైజేషన్ ప్రొసీడింగ్స్ అందజేశారు.10 పెండింగ్ పెన్షన్ కేసులను పరిష్కరించారు. డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ నరేశ్ కుమార్, అభయ్ అనిల్ సోనార్కర్, వనపర్తి, గద్వాల అడిషనల్ కలెక్టర్లు యాదయ్య, నర్సింగరావు పాల్గొన్నారు.