- బిగ్మింట్ రిపోర్ట్
న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లో స్టీల్ ధరలు ఐదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి. దిగుమతులు పెరగడం సహా పలు కారణాల వల్ల ప్రస్తుతం టన్ను ధర రూ. 47వేల నుంచి రూ. 48వేల మధ్య ట్రేడ్ అవుతున్నదని బిగ్మింట్ మార్కెట్ డేటా తెలిపింది. హాట్ రోల్డ్ కాయిల్ (హెచ్ఆర్సీ) టన్ను ధర రూ. 47,150కు, రీబార్ ధర హోల్సేల్మార్కెట్లో టన్నుకు రూ. 46,500 నుంచి -రూ. 47వేల మధ్య కోట్ అవుతోంది.
కరోనా తరువాత ధరలు ఇంతలా తగ్గడం ఇదే మొదటిసారి. ఎగుమతి డిమాండ్ లేకపోవడం, పెరుగుతున్న దిగుమతులు, అంతర్జాతీయ మార్కెట్లో అధిక సరఫరా కారణంగా ధరలు పడిపోతున్నాయి. చైనా వంటి దేశాల నుంచి దూకుడుగా వస్తున్న ఎగుమతుల ఒత్తిడితో భారతదేశ స్టీల్ ఎగుమతులు పడిపోయాయి. ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నప్పటికీ, దిగుమతులు మాత్రం పెరుగుతున్నాయి. దీంతో స్టీల్ మంత్రిత్వ శాఖ అక్టోబర్ 27న ఢిల్లీలో పరిశ్రమల వాటాదారులతో సమావేశం (ఓపెన్ హౌస్) ఏర్పాటు చేసింది.
దిగుమతి ధరలు తగ్గడం వల్లే స్టీల్ దిగుమతులు పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కూడా పేర్కొంది. దేశీయ ఉత్పత్తిని పెంచడానికి విధానపరమైన మద్దతు అవసరమని తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్లో భారతదేశం 0.79 మెట్రిక్టన్నుల ఫినిష్డ్ స్టీల్ను దిగుమతి చేసుకుంది. ఇది ఆగస్టులోని 0.69 మెట్రిక్టన్నుల కంటే ఎక్కువ. దీంతో వరుసగా ఆరో నెల కూడా దిగుమతులు భారీగానే నమోదయ్యాయి. 2026 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో కూడా భారత్ నికర దిగుమతిదారుగా కొనసాగింది.
ఫినిష్డ్ స్టీల్ ధరలు పడిపోయినప్పటికీ, ముడిసరుకు ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఐరన్ ఓర్ ధరలు టన్నుకు రూ. 4,800 నుంచి రూ.ఐదు వేల వరకు ఉన్నాయి. కోకింగ్ కోల్ ధర టన్నుకు 205 డాలర్ల వరకు ఉంది. ఉత్పత్తి ఖర్చులు పెరగడం, బలహీనమైన వసూళ్ల కారణంగా అక్టోబర్– డిసెంబర్లో మిల్లుల మార్జిన్లపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని బిగ్మింట్ పేర్కొంది. అధిక నిల్వలు, డిమాండ్తగ్గుదల కారణంగా సమీప భవిష్యత్తులో స్టీల్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.
