ముంబై : బెంచ్మార్క్ ఇండెక్స్లు వరుసగా ఏడో సెషన్లోనూ లాభాల్లో కదిలాయి. ఇండెక్స్ హెవీ వెయిట్ షేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఎల్ అండ్ టీ పెరగడంతో బుధవారం మార్కెట్ గ్రీన్లో క్లోజయ్యింది. విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) నికర కొనుగోలుదారులుగా మారడం, క్రూడాయిల్ ధరలు తగ్గడం కలిసొచ్చింది. 30 షేర్లున్న సెన్సెక్స్ బుధవారం 358 పాయింట్లు (0.52 శాతం) పెరిగి 69,654 దగ్గర ముగిసింది. ఇంట్రాడేలో ఆల్టైమ్ హై 69,745 లెవెల్ను టచ్ చేసింది. నిఫ్టీ 83 పాయింట్లు లాభపడి 20,938 దగ్గర సెటిలయ్యింది.
ఇన్వెస్టర్ల సంపద రూ.2.17 లక్షల కోట్లు పెరిగింది. ‘అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నుంచి మార్కెట్ లాభాల్లో కదులుతోంది. ఇన్ఫ్లేషన్ తగ్గుతుండడం, యూఎస్ బాండ్ ఈల్డ్లు దిగొస్తుండడంతో పాటు ఎఫ్ఐఐలు నికర కొనుగోలుదారులుగా మారడంతో ఇండెక్స్లు కొత్త రికార్డ్లు క్రియేట్ చేస్తున్నాయి. జియో పొలిటికల్ టెన్షన్లు తగ్గాయి. చైనా క్రెడిట్ రేటింగ్ను మూడీస్ తగ్గించిన తర్వాత మన మార్కెట్లో సెంటిమెంట్ బలపడింది’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు.
సెన్సెక్స్లో విప్రో, ఐటీసీ, ఎల్ అండ్ టీ, టీసీఎస్, టాటా మోటార్స్, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు బుధవారం ఎక్కువగా లాభపడ్డాయి. మరోవైపు ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. బీఎస్ఈ లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.61 శాతం పెరగగా, మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఇండెక్స్లు కొద్ది పాటి లాభాలతో ముగిశాయి. గ్లోబల్గా చూస్తే, టోక్యో, హాంకాంగ్ మార్కెట్లు లాభపడగా, షాంఘై మార్కెట్ నష్టాల్లో క్లోజయ్యింది.