- కొనసాగుతున్న మార్కెట్ పతనం
- మరో రూ.3 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు
- 900 పాయింట్లు పడిన సెన్సెక్స్
ముంబై: మార్కెట్లో నష్టాల పరంపర కొనసాగుతోంది. బెంచ్మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ గురువారం సెషన్లో మరో 900 పాయింట్లు పతనమై 64 వేల లెవెల్ కిందకొచ్చింది. నిఫ్టీ 19,000 లెవెల్ దిగువకు పడిపోయింది. మిడిల్ ఈస్ట్లో టెన్షన్స్ కొనసాగుతున్న వేళ అన్ని సెక్టార్ల ఇండెక్స్లు గురువారం భారీగా పడ్డాయి. ఈ ఒక్క సెషన్లోనే ఇన్వెస్టర్ల సంపద రూ.3 లక్షల కోట్లు తగ్గింది.
సెన్సెక్స్ 901 పాయింట్లు (1.41 శాతం) తగ్గి 63,148 దగ్గర క్లోజయ్యింది. నిఫ్టీ 265 పాయింట్లు పడి 18,857 దగ్గర ముగిసింది. బీఎస్ఈలోని 2,232 షేర్లు గురువారం నష్టపోగా, 1,426 షేర్లు లాభాల్లో ముగిశాయి. ‘నిఫ్టీ వరుసగా ఆరో సెషన్లోనూ నష్టపోయింది. యూఎస్ కంపెనీల రిజల్ట్స్ ఇన్వెస్టర్లను మెప్పించకపోవడంతో అక్కడి మార్కెట్లు పడుతున్నాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపై పడుతోంది’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ దీపక్ జాసాని అన్నారు. ఈ నెల 17 నుంచి చూస్తే సెన్సెక్స్ 3,280 పాయింట్లు (4.93 శాతం) క్రాష్ అయ్యింది.
ఇదే టైమ్లో నిఫ్టీ 954 పాయింట్లు పడింది. సెన్సెక్స్లో మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, ఏషియన్ పెయింట్స్, నెస్లే, జేఎస్డబ్ల్యూ స్టీల్, టైటాన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, లార్సెన్ అండ్ టుబ్రో షేర్లు గురువారం ఎక్కువగా పడ్డాయి. యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, హెచ్సీఎల్ టెక్, ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో క్లోజయ్యాయి. డొమెస్టిక్ కంపెనీల క్యూ2 రిజల్ట్స్ ఇన్వెస్టర్లను మెప్పించలేకపోతున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు.
అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇలాంటి ట్రెండే కనిపిస్తోందని చెప్పారు. జియో పొలిటికల్ టెన్షన్లు, పెరిగిన వడ్డీ రేట్ల కారణంగా ఫ్యూచర్లో కంపెనీల లాభాలు పడిపోతాయనే భయాలు పెరిగాయని చెప్పారు. ‘ఎక్స్పైరీ రోజు కావడంతో కూడా అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఇన్వెస్టర్లు జాగ్రత్త వహిస్తున్నారు’ అని వినోద్ నాయర్ అన్నారు. బ్రాడ్ మార్కెట్లో బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ ఒక శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.32 శాతం పడ్డాయి. ‘అన్ని సెక్టార్ల ఇండెక్స్లు గురువారం 1–2 శాతం వరకు పడ్డాయి.
మిడిల్ ఈస్ట్లో టెన్షన్లు, యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ 5 శాతం టచ్ చేయడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింటోంది. వీటికి అదనంగా కంపెనీల క్యూ2 రిజల్ట్స్ మిశ్రమంగా ఉండడం, ఎఫ్ఐఐల సెల్లింగ్ కొనసాగుతుండడం, డాలర్ మారకంలో రూపాయి విలువ పడుతుండడం వంటి అంశాలు మార్కెట్పై నెగెటివ్ ప్రభావం చూపుతున్నాయి’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ సిద్ధార్ధ ఖేమ్కా అన్నారు. గ్లోబల్ మార్కెట్లలో సియోల్, టోక్యో, హాంకాంగ్ నష్టాల్లో ముగిశాయి. షాంఘై మార్కెట్ గ్రీన్లో కదిలింది. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్కు 89.54 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది.
యూఎస్ జీడీపీ..
యూఎస్ జీడీపీ ఈ ఏడాది సెప్టెంబర్తో ముగిసిన క్వార్టర్లో 4.9 శాతం వృద్ధి సాధించింది. ఇది ఎనలిస్టులు వేసిన అంచనా 4.7 శాతం కంటే ఎక్కువ. ఈ ఏడాది జూన్ క్వార్టర్లో ఈ దేశ జీడీపీ 2.1 శాతం వృద్ధి చెందింది. మరోవైపు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కిందటేడాది జులై తర్వాత మొదటిసారిగా వడ్డీ రేట్లను మార్చలేదు. బెంచ్మార్క్ రేట్ 4 శాతం దగ్గర కొనసాగుతోంది.