- జులైలో 30 లక్షల కొత్త అకౌంట్లు ఓపెన్
ముంబై: స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తుండటంతో కొత్త డీమ్యాట్ అకౌంట్ల ఓపెనింగ్ జోరుగా సాగుతోంది. జులై నెలలో సీడీఎస్ఎల్, ఎన్ఎస్డీఎల్ వద్ద కొత్తగా 30 లక్షల డీమ్యాట్ అకౌంట్లు ఓపెనయ్యాయి. జనవరి 2022 నుంచి చూస్తే ఒక నెలలో ఇదే అత్యధికం. కిందటి 12 నెలల సగటు 20 లక్షల కంటే కూడా జులై నెలలో ఓపెనయిన డీమ్యాట్ అకౌంట్లు ఎక్కువగానే ఉండటం విశేషం.
ఫలితంగా మొత్తం డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య కొత్తహై అయిన 12.35 కోట్లకు చేరింది. ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్టర్ల ఆసక్తిపై మార్కెట్ సెంటిమెంట్ ఒకింత ఎక్కువగానే పనిచేస్తుంది. ఇటీవలి కాలంలో నిఫ్టీ, సెన్సెక్స్ల కంటే మైక్రో–క్యాప్, స్మాల్–క్యాప్ ఇండెక్స్లు ఎక్కువగా పెరుగుతున్నాయి. దీంతో ఈక్విటీ మార్కెట్పై రిటెయిల్ ఇన్వెస్టర్లలో మళ్లీ ఆసక్తి పెరిగింది. నిఫ్టీ, సెన్సెక్స్ కొత్త హైలు రికార్డు చేస్తున్న నేపథ్యం రిటెయిల్ ఇన్వెస్టర్లను మార్కెట్వైపు రప్పిస్తోందని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అర్విందర్ సింగ్ నంద చెప్పారు.
డెరివేటివ్స్ ట్రేడింగ్అంటే తెగ ఇష్టపడుతున్నారని పేర్కొన్నారు. ఎఫ్ఐఐల పెట్టుబడులు, ప్రైమరీ మార్కెట్లో ఐపీఓలు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల మద్దతు....అన్నీ కలిసి స్టాక్ మార్కెట్లపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయని అన్నారు.