లక్నో: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో పోలింగ్ జరిగేందుకు ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. పోలింగ్ శాతం పెరగడానికి, ఓటర్లలో చైతన్యం తేవడానికి కొన్ని సంస్థలు బంపర్ ఆఫర్లు ఇస్తుంటాయి. అయితే యూపీలోని ఓ స్కూల్ విద్యార్థులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. తల్లిదండ్రుల చేత ఓటేపిస్తే ఫైనల్ ఎగ్జామ్స్ లో 10 మార్కులు అదనంగా వేస్తామంటూ ఆఫర్ ఇచ్చింది .
యూపీలో లక్నోలోని క్రైస్ట్ చర్చ్ కాలేజీ అనే స్కూలు ఉంది. ఆ స్కూల్ గేట్ కు ఓ బ్యానర్ వేశారు. ఓటింగ్లో పాల్గొనడం ద్వారా దేశంపై మనకున్న నిబద్ధతను వ్యక్తీకరించవచ్చంటూ బ్యానర్ను తగిలించారు. ఓటింగ్లో విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆ బ్యానర్లో కోరారు. నగరంలోని ఇతర స్కూళ్లు కూడా ఓటింగ్ శాతం పెంచడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయని స్కూలు ప్రిన్సిపాల్ ఆర్కే ఛటర్జీ చెప్పారు. 2014 ఎన్నికల్లో లక్నోలో 58.44 శాతం పోలింగ్ మాత్రమే పోలైందని..ఈసారైనా ఓటింగ్ పర్సంటేజ్ ను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు ప్రిన్సిపల్.