పచ్చని చెట్లు.. ఎత్తైన కొండలు.. వాటిపై మంచు తెరలు.. మధ్య మధ్యలో లోయలు.. వీటన్నింటినీ దాటుతూ చేసే జర్నీ చాలామంది డ్రీమ్. ఆ జర్నీ మనసుకి నచ్చిన వాళ్లతో చేస్తే ఓ జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అలా తన ట్రిప్ని మెమరబుల్గా మార్చుకోవడానికి 28 ఏండ్ల సుధీశ్ తోడుగా తన పెట్ స్నోబెల్ని తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి బైక్పై దాదాపు15 రాష్ట్రాల్లో12, 000 కిలోమీటర్లు చుట్టేశారు. దీని వెనుక ఓ మంచి ఆలోచన కూడా ఉంది.
మొన్నీమధ్య రిలీజైన ‘777 చార్లీ’ సినిమాని తలపిస్తున్న ఈ కథ మొదలైంది కేరళలో. అక్కడే పుట్టి, పెరిగిన సుధీశ్కి చిన్నప్పట్నించీ ట్రావెలింగ్ అంటే ఇష్టం. ఫ్రెండ్స్తో కలిసి స్కూల్ టూర్స్కి వెళ్లాలన్న కోరిక బాగా ఉండేది అతనికి. కానీ, ఆర్థిక పరిస్థితుల వల్ల ఎప్పుడూ వెళ్లలేకపోయాడు. అలాగని ట్రావెలింగ్పై ఇష్టాన్ని వదులుకోలేదు. బాగా చదువుకొని.. మంచి ఉద్యోగం సంపాదించాలనుకున్నాడు. ఆ డబ్బుతో దేశం మొత్తం తిరగాలన్నది అతని ఆలోచన. అనుకున్నట్టే.. ఓ మెడికల్ స్టోర్లో మేనేజర్గా ఉద్యోగం తెచ్చుకున్నాడు. ఇంటి అవసరాలకి పోను మిగిలిన డబ్బుని దాచుకొని.. కేరళలోనే చిన్న చిన్న ట్రిప్స్ వేశాడు మొదట్లో. ఆ టైంలోనే ఓ కుక్కపిల్ల రోడ్డుపై చావు బతుకుల మధ్య కనిపించింది. దానికి ట్రీట్మెంట్ ఇప్పించి... తనతో పాటు ఇంటికి తీసుకొచ్చాడు. దానికి స్నోబెల్ అని పేరు కూడా పెట్టాడు. అలా మూడేండ్లు గడిచిపోయాయి.
ఆ ఆలోచన..
ఆ మూడేండ్లలో స్నోబెల్తో కలిసి ఎన్నో ట్రిప్లకి వెళ్లాడు సుధీశ్. కానీ, ఎన్ని అందమైన ప్లేస్లు తిరిగినా.. అతని మనసంతా లడఖ్ చుట్టూనే తిరుగుతుండేది. దాంతో ఆ కలని ఎలాగైనా నెరవేర్చుకోవాలని డిసైడ్ అయ్యాడు. అందుకోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టోర్లో పనిచేస్తూనే.. రాత్రిళ్లు జొమాటోలో ఫుడ్ డెలివరీ చేశాడు. అలా పోగుచేసుకున్న డబ్బుతో.. తన 100 సీసీ బైక్పై స్నోబెల్తో కలిసి లడఖ్ వెళ్లాలనుకున్నాడు. అయితే స్నోబెల్ని వెంట తీసుకెళ్లాలన్న ఆలోచన వెనుక ఓ కారణం ఉంది.‘‘చాలామంది వీధికుక్కలతో దురుసుగా ప్రవర్తిస్తుంటారు. వాటిని ఇష్టం వచ్చినట్టు కొడుతుంటారు. ఫారెన్ కుక్కల్ని ఒకలా.. స్ట్రీట్ డాగ్స్ని మరోలా ట్రీట్ చేస్తుంటారు. అది తప్పు అని నిరూపించడానికే నా కుక్కతో కలిసి జర్నీ చేయాలనుకున్నా’ అన్నాడు సుధీశ్. అయితే ఈ జర్నీ కోసం చాలా ప్రికాషన్స్ తీసుకున్నాడు అతను. యాభై వేల రూపాయలతో.. చిన్న చిన్న ట్రిప్ల వరకు ఓకే. కానీ, వేల కిలోమీటర్లు స్నోబెల్తో జర్నీ అంటే ... కష్టమే. దాంతో అన్ని మైళ్లు అది కంఫర్టబుల్గా, సేఫ్గా ఉండటానికి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై స్టడీ చేశాడు. యూట్యూబ్ వీడియోలు చూసి.. దానికోసం ప్రత్యేకంగా సీటు తయారుచేశాడు. ఆ సీటుని బైక్ వెనుక సీటు దగ్గర ఫిట్ చేశాడు. టెస్టింగ్ కోసం దాంతో కలిసి చుట్టు పక్కలున్న ప్లేస్లకి వెళ్లాడు. స్నోబెల్కి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చాడు. వెటర్నరీ డాక్టర్ని కలిసి.. స్నోబెల్కి అవసరమైన టెస్ట్లన్నీ చేయించాడు. పూర్తిగా నమ్మకం వచ్చాకే... 50,000 రూపాయలతో కొచ్చి నుంచి లడఖ్ జర్నీ మొదలుపెట్టాడు. క్యాంపెయిన్ స్టవ్, స్లీపింగ్ బ్యాగ్స్, టెంట్... ఇలా అవసరమైన వస్తువులన్నీ వెంట తీసుకెళ్లాడు సుధీశ్. అలాగే ఈ జర్నీలో ఏ రోజూ హోటళ్లలో బస చేయలేదు. బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా తనే ప్రిపేర్ చేసుకునేవాడు. దాంతో.. బడ్జెట్లోనే ఈ మధ్యే తన డ్రీమ్ ట్రిప్ కంప్లీట్ చేశాడు.
మే 8 న మా లడఖ్ జర్నీ మొదలైంది. నిజానికి నా కలని.. నా కంటే స్నో బెల్ ఎక్కువ ఆస్వాదించింది. ముఖ్యంగా జమ్మూ– కాశ్మీర్ వెళ్లినప్పుడు దాని ఆనందం చూడాలి. మంచులో గెంతులేసింది. నాతో పాటు కొండలు, గుట్టలు ఎక్కింది. జలపాతాలతో ఆటలాడింది కూడా. నా బైక్ వెనుక కూర్చున్న స్నోబెల్ని చూసి.. చాలామంది మమ్మల్ని పలకరించారు. మా కథ అడిగి తెలుసుకొని, ప్రేమగా దాని తల నిమిరారు. ఈ జర్నీ ద్వారా కొంతమందికైనా స్ట్రీట్ డాగ్స్ గురించి చెప్పగలిగా అన్నాడు సుధీశ్.