మోంటెకార్లో: ఇండియా టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ మరో రికార్డు సృష్టించాడు. మట్టి కోర్టులో ఓ ఏటీపీ మాస్టర్స్ టోర్నమెంట్ మెయిన్ డ్రా మ్యాచ్ నెగ్గిన తొలి ఇండియన్గా నిలిచాడు. మోంటె కార్లో టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన తొలి రౌండ్లో నాగల్ 5–7, 6–2, 6–4తో వరల్డ్ 38వ ర్యాంకర్ మాటెయో అర్నాల్డికి షాకిచ్చి ఈ ఘనత సాధించాడు.
వరల్డ్ టాప్50 ప్లేయర్లపై నాగల్కు ఇది మూడో విజయం కావడం విశేషం. తన కంటే మెరుగైన ర్యాంకర్ అర్నాల్డిపై నాగల్ అద్భుత పెర్ఫామెన్స్ చేశాడు. తొలి సెట్లో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. చెరో గేమ్ నెగ్గుతూ ముందుకెళ్లారు. కానీ, 12వ గేమ్లో నాగల్ సర్వీస్ బ్రేక్ చేసిన అర్నాల్డి సెట్ నెగ్గి ఆధిక్యం సాధించాడు. కానీ, రెండో సెట్ ఆరంభంలోనే రెండుసార్లు ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసిన నాగల్ 4–1తో లీడ్లోకి వచ్చాడు.
అదే జోరుతో సెట్ నెగ్గి స్కోరు సమం చేశాడు. మూడో సెట్లోనూ ఇద్దరూ నువ్వానేనా అన్నట్టు తలపడగా.. కీలక సమయాల్లో రెండు బ్రేక్స్ సాధించిన సుమిత్ పదో గేమ్లో సెట్తో పాటు మ్యాచ్ నెగ్గాడు. రెండో రౌండ్లో నాగల్ ఏడో ర్యాంకర్ హోల్గర్ రూనె (డెన్మార్క్)తో పోటీ పడనున్నాడు.