సమ్మర్ క్రికెట్ కార్నివాల్ ఐపీఎల్ మళ్లీ వచ్చేస్తోంది. మూడు సీజన్ల తర్వాత తిరిగి హోమ్, అవే ఫార్మాట్లో ఇండియాను చుట్టేయనుంది. పది జట్లు పోటీలో ఉండగా.. ఈసారి 12 స్టేడియాల్లో ఫ్యాన్స్కు కిక్ ఇవ్వనుంది. ఈ నెల 31న మొదలయ్యే మెగా లీగ్లో హైదరాబాదీలను అలరించడానికి సన్రైజర్స్ టీమ్ కూడా రెడీ అయింది. కొన్నేళ్లుగా నిరాశ పరుస్తున్న రైజర్స్ ఈసారి కొత్త కోచ్, కొత్త కెప్టెన్తో పాటు చాలా మంది కొత్త ప్లేయర్లను మార్చుకొని సరికొత్తగా బరిలోకి దిగుతోంది. మన జట్టు ఎలా ఉందో చూద్దాం.
సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై చివరగా 2019 ఏప్రిల్ 29న పంజాబ్ కింగ్స్తో తలపడింది. నాలుగేండ్లు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఈ ఏప్రిల్ 2న ఉప్పల్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్తో పోరులో సన్రైజర్స్ పూర్తిగా కొత్త టీమ్తో బరిలోకి దిగనుంది. 2019లో జరిగిన ఆ పోరులో ఆడిన భువనేశ్వర్ కుమార్, అభిషేక్ శర్మ, బెంచ్పైన ఉన్న టి. నటరాజన్ మాత్రమే ఇప్పటికీ టీమ్లో కొనసాగుతున్నారు. అసలు గత సీజన్తో పోల్చినా ప్రస్తుత టీమ్ పూర్తిగా మారింది.
తమ అలవాటుకు భిన్నంగా భారీ రేటు ప్లేయర్లను వదిలిపెట్టిన ఫ్రాంచైజీ తమ రాత మార్చగలరని అనుకున్న కొంతమంది ఇన్ఫామ్ ప్లేయర్లను తీసుకుంది. ఒకరిద్దరు ఆటగాళ్లపై అతిగా ఆధారపడి బోల్తా కొట్టిన రైజర్స్ ఈసారి అన్ని విభాగాల్లోనూ మెరుగైన ఆటగాళ్లతో ఎంతో బలంగా కనిస్తోంది. గత రెండు సీజన్లలో ఎనిమిదో స్థానంతో సరిపెట్టడంతో ప్లేయర్లతో పాటు కోచింగ్ స్టాఫ్లో సమూల మార్పులు చేసింది. ఈసారి హెడ్ కోచ్గా వెస్టిండీస్ గ్రేట్ బ్రియాన్ లారాకు బాధ్యతలు ఇచ్చింది.
కేన్ విలియమ్సన్ను పూర్తిగా వదిలేసి.. సౌతాఫ్రికా స్టార్ ఐడెన్ మార్క్రమ్కు కెప్టెన్సీ అప్పగించింది. ఎస్ఏ టీ20 లీగ్లో సన్రైజర్స్ ఫ్రాంచైజీని విజేతగా నిలిపిన మార్క్రమ్ ఐపీఎల్లోనూ ఆ రిజల్ట్ రిపీట్ చేస్తాడని గంపెడాశలు పెట్టుకుంది. అయితే, నెదర్లాండ్స్తో వన్డే సిరీస్లో ఆడుతున్న సౌతాఫ్రికా త్రయం మార్క్రమ్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్ తొలి మ్యాచ్కు దూరంగా ఉండనున్నారు.
వేలంలో ఆచితూచి
వేలంలో గతానికి భిన్నంగా సన్రైజర్స్ పర్ఫెక్ట్ ప్లానింగ్తో ప్లేయర్లను కొనుగోలు చేసింది. గత సీజన్ టీమ్లోని ఫారినర్స్లో సగం మందిని తప్పించడంతో దాదాపు 35 కోట్లను సేకరించిన రైజర్స్ అందులో 30 శాతం ఇంగ్లండ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హ్యారీ బ్రూక్ (13.25 కోట్లు) కోసం వెచ్చించింది.
పూరన్ స్థానంలో గొప్ప ఫామ్లో ఉన్న హెన్రిచ్ క్లాసెన్ను తీసుకుంది. స్టార్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ లేకపోవడం సన్రైజర్స్ను భారీ దెబ్బకొట్టింది. ఈసారి ఆదిల్ రషీద్తో ఆ ప్లేస్ను భర్తీ చేసింది. ఇక, మయాంక్ అగర్వాల్ రాకతో టాపార్డర్ సైతం చాలా బలోపేతం అయింది. రిటైన్ చేసుకున్న స్పీడ్స్టర్ ఉమ్రాన్. సుందర్, రాహుల్ త్రిపాఠిపైనా అంచనాలున్నాయి.
బ్రూక్పై భారీ ఆశలు..
ఇంగ్లండ్ యంగ్స్టర్ హ్యారీ బ్రూక్పై రైజర్స్ చాలా ఆశలు పెట్టుకుంది. డ్రీమ్ ఫామ్లో ఉన్న బ్రూక్ మూడు ఫార్మాట్లలో ఇంగ్లండ్ తరపున అదరగొడుతున్నాడు. టీ20 వరల్డ్ కప్ నెగ్గిన టీమ్లో మెంబర్ అయిన 24 ఏండ్ల బ్రూక్ తొలిసారి వేలంలోకి రాగా సన్రైజర్స్ ఏకంగా 13.25 కోట్లు కుమ్మరించి ఆశ్చర్యపరిచింది. అతని టాలెంట్ కూడా అలాంటిదే మరి. హార్డ్ హిట్టర్ అయిన బ్రూక్ ఇంగ్లండ్ ఫ్యూచర్ స్టార్గా పేరు తెచ్చుకున్నాడు. టెస్టుల్లోనే దాదాపు వంద స్ట్రయిక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నాడు.
ఈ సీజన్లో అతడికి ఫినిషర్ రోల్ అప్పగించాలని రైజర్స్ భావిస్తోంది. ఇక, జమ్మూ కశ్మీర్ యంగ్ ఆల్రౌండర్ అబ్దుల్ సమద్ గతేడాది పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కానీ ఈ హిట్టర్ను రైజర్స్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉపయోగించుకునే అవకాశం ఉంది. సౌతాఫ్రికా పేసర్ మార్కో జాన్సెన్, ఇండియా యంగ్ పేసర్ కార్తీక్ త్యాగి కూడా కీలకం కానున్నారు.
సన్రైజర్స్ టీమ్
ఐడెన్ మార్ క్రమ్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, అబ్దుల్ సమద్, అన్మోల్ప్రీత్ సింగ్, హ్యారీ బ్రూక్, నితీష్ రెడ్డి, రాహుల్ త్రిపాఠి, సమర్థ్ వ్యాస్, సన్వీర్ సింగ్, వివ్రాంత్ శర్మ, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, గ్లెన్ ఫిలిప్స్, ఉపేంద్ర యాదవ్, అకీల్ హుస్సేన్ , మయాంక్ దాగర్, ఫజలాక్ ఫరూకీ, కార్తీక్ త్యాగి, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి. నటరాజన్, ఆదిల్ రషీద్, ఉమ్రాన్ మాలిక్.