బ్యాటింగ్లో మోస్తరుగా ఆడినా.. బౌలింగ్లో అదుర్స్ అనిపించిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్లో అదరగొట్టింది..! లాస్ట్ మ్యాచ్లో ఢిల్లీకి, ఇప్పుడు బలమైన చెన్నైకి చెక్ పెడుతూ.. విజయాలబాట పట్టింది..! యంగ్స్టర్స్ ప్రియమ్ గార్గ్ (26 బాల్స్లో 51 నాటౌట్, 6 ఫోర్లు, 1 సిక్స్), అభిషేక్ శర్మ (24 బాల్స్లో 31, 4 ఫోర్లు, 1 సిక్స్) కీలక భాగస్వామ్యం నెలకొల్పడంతో.. మంచి టార్గెట్ను నిర్దేశించిన వార్నర్సేన.. దానిని అద్భుతంగా కాపాడు కుంది..! స్టార్ హిట్టర్లలో రవీంద్ర జడేజా (35 బాల్స్లో 50, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా మిగతా వారు తేలిపోవడంతో చెన్నైకి హ్యాట్రిక్ ఓటమి తప్పలేదు!!
దుబాయ్: ఐపీఎల్–13లో హైదరాబాద్కు రెండో విజయం. మన టాప్ స్టార్లు విఫలమైనా.. చివర్లో ఇద్దరు కుర్రాళ్లు స్ఫూర్తిదాయక పోరాటం చేయడంతో.. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో 7 రన్స్ తేడాతో చెన్నై సూపర్కింగ్స్పై గెలిచింది. సీఎస్కే కెప్టెన్ ధోనీ (36 బాల్స్లో 47 నాటౌట్, 4 ఫోర్లు, 1 సిక్స్) చివరి బాల్ వరకు పోరాటం చేసినా టీమ్ను గట్టెక్కించలేకపోయాడు. టాస్ గెలిచిన హైదరాబాద్ 20 ఓవర్లలో 164/5 స్కోరు చేసింది. తర్వాత చెన్నై 20 ఓవర్లలో 157/5 స్కోరుకే పరిమితమైంది. గార్గ్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
టాప్ లేచింది..
సన్రైజర్స్కు సరైన ఆరంభం దక్కలేదు. ఇన్నింగ్స్ నాలుగో బాల్కే బెయిర్స్టో (0)ను దీపక్ చహర్ (2/31) ఔట్ చేశాడు. ఈ తడబాటు నుంచి కోలుకునేందుకు వార్నర్ (29 బాల్స్లో 28, 3 ఫోర్లు), మనీష్ పాండే (21 బాల్స్లో 29, 5 ఫోర్లు) ఆచితూచి ఆడటం మొదలుపెట్టారు. రెండో ఎండ్లో సామ్ కరన్ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా మధ్యలో ఓవర్కో ఫోర్ ఉండేలా జాగ్రత్త పడ్డారు. ఫలితంగా పవర్ప్లేలో హైదరాబాద్ 42/1 స్కోరు చేసింది. 8వ ఓవర్లో శార్దూల్ ఆఫ్సైడ్ వేసిన గుడ్ లెంగ్త్ బాల్ను షాట్ కొట్టబోయిన మనీష్.. మిడాఫ్లో కరన్ చేతికి చిక్కాడు. ఈ టైమ్లో వార్నర్తో జత కలిసిన విలియమ్సన్ (9) సింగిల్స్కే పరిమితమయ్యారు. తర్వాతి రెండు ఓవర్లలో 8, 3 రన్స్ మాత్రమే రావడంతో ఫస్ట్ టెన్లో హైదరాబాద్ 2 వికెట్లకు 63 రన్స్ చేసింది. ఇక 11వ ఓవర్లో నాలుగో బాల్ను బౌండ్రీకి తరలించిన వార్నర్.. తర్వాతి బాల్కు భారీ షాట్ ఆడాడు. కానీ రోప్ వద్ద డుప్లెసిస్ వండర్ఫుల్ క్యాచ్ అందుకున్నాడు. ఆ తర్వాతి బాల్కే విలియమ్సన్ అనూహ్యంగా రనౌట్ అయ్యాడు.
77 రన్స్ పార్ట్నర్షిప్
ఇక హైదరాబాద్ 150 రన్స్ చేస్తే మహా గొప్ప అనుకున్న తరుణంలో 69/4 స్కోరు వద్ద క్రీజులోకి వచ్చిన ప్రియమ్ గార్గ్, అభిషేక్ అద్భుతంగా ఆడారు. జడేజా బౌలింగ్లో అభిషేక్ 4, 6తో టచ్లోకి వచ్చాడు. ఐదు ఓవర్ల (11 నుంచి 15)లో 37 రన్స్ రావడంతో హైదరాబాద్ స్కోరు సరిగ్గా 100 రన్స్కు చేరింది. అప్పటివరకు సింగిల్స్తో ఉన్న గార్గ్.. 16వ ఓవర్ లాస్ట్ బాల్కు ఫోర్ కొట్టడంతో 11 రన్స్ వచ్చాయి. తర్వాతి ఓవర్ (కరన్)లో వరుసగా 4, 4, 6, 4తో 22 రన్స్ రావడంతో స్కోరు వేగం పెరిగింది. 18వ ఓవర్లో తొలి రెండు బంతులకు అభిషేక్ ఇచ్చిన వరుస క్యాచ్లను జడేజా, శార్దూల్ వదిలేసినా లాస్ట్ బాల్కు ధోనీ అద్భుతంగా అందుకున్నాడు. ఐదో వికెట్కు 77 రన్స్ జతకావడంతో హైదరాబాద్ పుంజుకుంది. చివరి రెండు ఓవర్లలో 18 రన్స్ రావడంతో హైదరాబాద్ మంచి టార్గెట్ను నిర్దేశించింది.
‘టాప్’ విఫలం..ధోనీ, జడ్డూ పోరాటం
హైదరాబాద్ బౌలర్లు బాగా బౌలింగ్ చేయడంతో రెండో ఓవర్లోనే వాట్సన్ (1) ఔటయ్యాడు. డుప్లెసిస్ (22), రాయుడు (8) ఫోర్లు బాదినా.. ఆరో ఓవర్లో సీఎస్కేకు ఊహించని బ్రేక్ పడింది. ఫస్ట్ బాల్కు రాయుడును నటరాజన్ బోల్తా కొట్టిస్తే, లాస్ట్ బాల్కు డుప్లెసిస్ రనౌట్ అయ్యాడు. దీంతో స్కోరు ఒక్కసారిగా 36/3గా మారింది. కేదార్ (3)తో జత కలిసిన కెప్టెన్ ధోనీ ఇన్నింగ్స్ను నిదానంగా మొదలుపెట్టాడు. ఏడో ఓవర్లో 4, ఎనిమిదో ఓవర్లో ఒక్క పరుగే రావడంతో రన్రేట్ తగ్గింది. ఇది చాలదన్నట్లు 9వ ఓవర్లో కేదార్ను సమద్ పెవిలియన్కు చేర్చడంతో చెన్నై 42/4తో కష్టాల్లో పడింది. రెండువైపుల నుంచి స్పిన్నర్లు రషీద్, సమద్ ఒత్తిడి పెంచడంతో చెన్నై 44/4 స్కోరుతో తొలి పది ఓవర్లను ముగించింది. ఇక ధోనీతో జతకలిసిన జడేజా నిలబడే ప్రయత్నం చేశాడు. 11 నుంచి 15వ ఓవర్ వరకు వరుసగా11, 3, 3, 10, 8 రన్సే రావడంతో చెన్నై టార్గెట్ ఛేజ్ కష్టంగా మారింది. దీంతో ఆఖరి 5 ఓవర్లలో సీఎస్కేకు 86 రన్స్ అవసరమయ్యాయి. 16వ ఓవర్లో 8 రన్సే వచ్చినా.. భువీ వేసిన 17వ ఓవర్లో జడేజా 4, 4, 4 కొట్టాడు. తర్వాతి ఓవర్లో ఓ ఫోర్, సిక్స్తో 34 బాల్స్లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసిన జడ్డూ.. తర్వాతి బాల్ను బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్లోకి లేపడంతో సమద్ క్యాచ్ అందుకున్నాడు. దాంతో ఐదో వికెట్కు 72 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. సామ్ కరన్ (15 నాటౌట్) సిక్స్తో ఖాతా తెరవడంతో విజయసమీకరణం 12 బాల్స్లో 44 రన్స్గా మారింది. తర్వాతి ఓవర్లో ధోనీ 4, 6తో 16 రన్స్ రాబట్టాడు. లాస్ట్ ఓవర్లో 28 రన్స్కుగానూ 20 మాత్రమే రావడంతో ఓటమి తప్పలేదు.
ధోనీ @ 194
ఐపీఎల్లో హయ్యెస్ట్ మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా ధోనీ రికార్డులకెక్కాడు. సురేశ్ రైనా (193) రికార్డును అధిగమించాడు. 2008 నుంచి చెన్నై సూపర్కింగ్స్కు కెప్టెన్గా వ్యవహరించిన మహీకి ఈ ఫ్రాంచైజీ తరఫున ఇది164 మ్యాచ్. స్పాట్ ఫిక్సింగ్ కారణంగా 2016, 2017లో సీఎస్కే లీగ్కు దూరమైనప్పుడు ధోనీ.. రైజింగ్ పుణె సూపర్జెయింట్స్ (ఆర్పీఎస్)కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ రెండేళ్లలో ఆర్పీఎస్కు 30 మ్యాచ్లు ఆడాడు. ఓవరాల్గా ధోనీ తొమ్మిది ఫైనల్స్లో పాల్గొన్నాడు. అయితే ఒకే ఫ్రాంచైజీకి ఎక్కువ మ్యాచ్లు ఆడిన రికార్డు మాత్రం విరాట్ కోహ్లీ (180) పేరుమీద ఉంది.
స్కోరు బోర్డు
హైదరాబాద్: వార్నర్ (సి) డుప్లెసిస్ (బి) చావ్లా 28, బెయిర్స్టో ((బి) చహర్ 0, మనీష్ (సి) కరన్ (బి) శార్దూల్ 29, విలియమ్సన్ (రనౌట్) 9, ప్రియమ్ గార్గ్ (నాటౌట్) 51, అభిషేక్ శర్మ (సి) ధోనీ (బి) చహర్ 31, అబ్దుల్ సమద్ (నాటౌట్) 8, ఎక్స్ట్రాలు: 8, మొత్తం: 20 ఓవర్లలో 164/5. వికెట్ల పతనం: 1–1, 2–47, 3–69, 4–69, 5–146. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–31–2, కరన్ 3–0–37–0, శార్దూల్ 4–0–32–1, బ్రావో 47–0–28–0, చావ్లా 3–0–20–1, జడేజా 2–0–16–0.
చెన్నై: డుప్లెసిస్ (రనౌట్) 22, వాట్సన్ (బి) భువనేశ్వర్ 1, రాయుడు (బి) నటరాజన్ 8, జాదవ్ (సి) వార్నర్ (బి) సమద్ 3, ధోనీ (నాటౌట్) 47, జడేజా (సి) సమద్ (బి) నటరాజన్ 50, కరన్ (నాటౌట్) 15, ఎక్స్ట్రాలు: 11, మొత్తం: 20 ఓవర్లలో 157/5.
వికెట్ల పతనం: 1–4, 2–26, 3–36, 4–42, 5–114. బౌలింగ్: భువనేశ్వర్ 3.1–0–20–1, ఖలీల్ 3.5–0–34–0, నటరాజన్ 4–0–43–2, అభిషేక్1–0–4–0, రషీద్ ఖాన్ 4–0–12–0, అబ్దుల్ సమద్ 4–0–41–1.