న్యూఢిల్లీ: కొత్త అగ్రి చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ, హర్యానా బార్డర్లో రైతులు రోజూ హైవేలను బ్లాక్ చేస్తుండటంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రైతులకు సమస్యలు ఉండొచ్చని, అందుకని రోజూ హైవేలను బ్లాక్ చేస్తారా అని నిలదీసింది. ఇలాగైతే ఎలాగని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది. తాము జోక్యం చేసుకొని ఆదేశాలిస్తే కోర్టు పరిధి దాటుతోందని అంటారని కామెంట్ చేసింది. కోర్టులు చట్టాల గురించి చెబుతాయని, అమలు చేయాల్సింది ప్రభుత్వాలని గుర్తు చేసింది. జాతీయ రహదారులను దిగ్బంధించడం సమస్యకు పరిష్కారం కాదంది. రోడ్లను బ్లాక్ చేస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని నోయిడాకు చెందిన మోనికా అగర్వాల్ కోర్టులో పిల్ దాఖలు చేశారు. గతంలో ఢిల్లీ చేరుకోవడానికి 20 నిమిషాలు పట్టేదని, ఇప్పుడు 2 గంటలకు పైగా పడుతోందని, రైతుల నిరసనల వల్ల జనం ఇబ్బంది పడుతున్నారని వివరించారు. ఈ పిల్పై కోర్టు గురువారం విచారణ జరిపింది.
ఒక్క రోజంటే ఏమో అనుకోవచ్చు..
‘రైతులకు బాధ ఉండొచ్చు. అలాగని రోడ్లు బ్లాక్ చేస్తే జనాలు కూడా ఇబ్బంది పడతారు. ఒకరోజంటే అనుకోవచ్చు. రోజూ రోడ్లను బ్లాక్ చేస్తే ఎలా? హైవేలను శాశ్వతంగా బ్లాక్ చేయకూడదు’ అని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. దీనికి సంబంధించి కేంద్రం ఏం చేస్తోందని ప్రశ్నించింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. రైతుల సమస్య పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీని నియమించామని, ఆ కమిటీతో చర్చించేందుకు రైతు సంఘాలు నిరాకరించాయని చెప్పింది. పిల్లో భారత్ కిసాన్యూనియన్, నిరసన తెలుపుతున్న ఇతర రైతుల సంఘాలను పార్టీలుగా చేర్చాలని కోర్టును కోరగా పిటిషన్ దాఖలు చేయాలని కోర్టు చెప్పింది. విచారణను అక్టోబర్4వ తేదీకి వాయిదా వేసింది. భారత్బంద్ సందర్భంగా సోమవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 40 రైతు సంఘాలు ర్యాలీలు తీశాయి. నిరసన ప్రదర్శనలు ఇచ్చాయి. దీంతో రోడ్లు బ్లాకై ఢిల్లీ, యూపీ, హర్యానా బార్డర్లలో ట్రాఫిక్కు ఇబ్బంది కలిగింది. ఘజియాబాద్ పోలీసులు ఢిల్లీలోని నిజాముద్దీన్, ఘజియాబాద్ హైవేను క్లోజ్ చేశారు.
జడ్జిలుగా 16 మంది పేర్లు ప్రతిపాదించిన కొలీజియం
బాంబే, గుజరాత్, ఒడిశా, పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులకు జడ్జిలుగా నియమించేందుకు ఆరుగురు జ్యుడీషియల్ ఆఫీసర్లు, 10 మంది లాయర్ల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదించింది. బుధవారం జరిగిన మీటింగ్లో కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది.