
- భద్రతా కారణాల వల్ల నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కోర్టు ప్రాంగణంలోని హై సెక్యూరిటీ జోన్లో వీడియోగ్రఫీ, ఫొటోగ్రఫీ, రీల్స్తీయడంపై పూర్తిగా నిషేధం విధించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు పరిపాలనా విభాగం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు, న్యాయస్థానం ఆవరణలో ప్రతిరోజూ ఉండే ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. పరిపాలనా విభాగం కొత్త గైడ్స్ లైన్స్ ప్రకారం.. సుప్రీంకోర్టు హై-సెక్యూరిటీ జోన్లో ఏ వ్యక్తి కూడా ఫోన్లో ఫొటోలు తీయడానికి లేదా వీడియోలు, రీల్స్చేయడానికి అనుమతి లేదు.
హైసెక్యూరిటీ జోన్లో మొబైల్ ఫోన్లతో పాటు కెమెరాలు, ట్రైపాడ్లు, సెల్ఫీ స్టిక్లు ఉపయోగించడం కూడా నిషేధం. అనుమతించిన సెక్యూరిటీ జోన్లో మాత్రమే జర్నలిస్టులు ఇంటర్వ్యూలు, ప్రత్యక్ష ప్రసారాలు నిర్వహించడానికి అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘించినట్టు తేలితే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఒకవేళ మీడియా సిబ్బంది రూల్స్ బ్రేక్ చేస్తే.. నెల రోజులు హై-సెక్యూరిటీ జోన్లోకి ప్రవేశించకుండా నిషేధం విధించనున్నట్టు తెలిపింది. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ సిబ్బంది, ఇతర విభాగ ఉద్యోగులు కూడా కఠినమైన నిఘాలో ఉంటారని.. వారు కూడా నిబంధనలను ఉల్లంఘిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సుప్రీం హెచ్చరించారు.