న్యూఢిల్లీ: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్య ఘటనలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఐఐటీ ఖరగ్పూర్తో పాటు గ్రేటర్ నోయిడాలోని శారదా యూనివర్సిటీకి ఏమైందని ప్రశ్నించింది. ఆ విద్యా సంస్థల్లో స్టూడెంట్లు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారని ప్రశ్నించింది. ఆ రెండు ఇన్ స్టిట్యూషన్లలో విద్యార్థుల ఆత్మహత్యలపై దాఖలైన పిటిషన్ను జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ తో కూడిన బెంచ్ విచారణ జరిపింది. ఆ కేసుల్లో విచారణను వేగవంతం చేయాలని ఆదేశించింది.
ఐఐటీ ఖరగ్పూర్లో నాలుగో ఏడాది మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంపై బెంచ్ సీరియస్ అయింది. ‘‘ఐఐటీ ఖరగ్ పూర్కు ఏమైంది..? విద్యార్థులు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు..? ఈ సమస్యకు మీ (ఐఐటీ ఖరగ్ పూర్ మేనేజ్మెంట్) దగ్గర ఏమైనా పరిష్కారం ఉందా..?” అని ఐఐటీ ఖరగ్పూర్ అడ్వొకేట్ను బెంచ్ ప్రశ్నించింది. అలాగే, శారదా యూనివర్సిటీలో ఫీమేల్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకోవడంపైనా అడ్వొకేట్ను బెంచ్ పలు ప్రశ్నలు అడిగింది.
ఐఐటీ ఖరగ్పూర్తో పాటు శారదా వర్సిటీ కేసుల్లో అపర్ణా భట్ అమికస్ క్యూరీగా ఉన్నారు. శారదా వర్సిటీ కేసులో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా అని అపర్ణా భట్ ను బెంచ్ అడిగింది. అవునని భట్ చెప్పారు. కేసు ఎవరు రిజిస్టర్ చేశారని అడగగా.. విద్యార్థిని తండ్రి
ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని భట్ తెలిపారు.
