
- ఉచితమేదో, సంక్షేమమేదో తేల్చాలి
- సూచనలు ఇచ్చేందుకు కమిటీ వేస్తం: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
‘ఉచితం’ అనే పదాన్నే నిర్వచించాల్సిన అవసరం ఉంది. జాతీయ ఉపాధి హామీ స్కీం, ఫ్రీ డ్రింకింగ్ వాటర్, ఎడ్యుకేషన్, హెల్త్ వంటి హామీలను ఉచితాలుగా చెప్పలేం. ఎన్నికల్లో రాజకీయ పార్టీల విజయానికి ఉచిత హామీలే కారణమని కూడా అనలేం. ఉచిత వాగ్దానాలు చేసినా ఎలక్షన్స్లో ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఉచిత హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను అడ్డుకోలేం. ఏది సంక్షేమమో, ఏది ఉచితమో తేల్చుడు కష్టం. ఈ విషయంతో సంబంధం ఉన్న సంస్థలు, పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించి, ఉన్నత స్థాయి కమిటీకి తెలిపి సహకరించాలి.
- సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
న్యూఢిల్లీ: పథకాలలో సంక్షేమమేదో, ఉచితమేదో తేల్చాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఇది చాలా కాంప్లికేటెడ్గా ఉందని, ప్రజల సంక్షేమం ప్రభుత్వం బాధ్యత అని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ఓటర్లకు ఉచిత హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను నియంత్రించాలని కోరుతూ అడ్వొకేట్ అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు బుధవారం విచారించింది.
ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ జేకే మహేశ్వరీ, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ప్రజాధనాన్ని సరైన పద్ధతిలో ఖర్చు చేయడమే ఇక్కడ ప్రధాన అంశం. ‘ఉచితం’ అనే పదాన్నే నిర్వచించాల్సిన అవసరం ఉంది. జాతీయ ఉపాధి హామీ స్కీం, ఫ్రీ డ్రింకింగ్ వాటర్, ఎడ్యుకేషన్, హెల్త్ వంటి హామీలను ఉచితాలుగా వర్ణించలేం. ఎన్నికల్లో రాజకీయ పార్టీల విజయానికి ఉచిత హామీలే కారణమని కూడా చెప్పలేం. ఉచిత వాగ్దానాలు చేసినా ఎలక్షన్స్లో ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
ఈ అంశాన్ని పరిశీలించే సామర్థ్యం న్యాయ స్థానానికి ఉందా..? అనే ప్రశ్న కూడా ముందుకు వస్తున్నది..” అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఉచిత వాగ్దానాల సమస్య జఠిలమవుతుందన్న జస్టిస్ ఎన్వీ రమణ, అసలు ఉచిత హామీ, వెల్ఫేర్ స్కీం అని తేల్చేది ఎలా అంటూ ప్రశ్నించారు. ఉచిత తాయిలం అంటే ఏంటో అర్థాన్ని వివరించాల్సిన అవసరం ఉందని, ఈ అంశంపై మరింత చర్చ జరగాలని, దీని కోసం కమిటీ ఏర్పాటు చేయాలని బెంచ్ భావిస్తున్నట్టు పేర్కొన్నారు.
22వ తేదీకి విచారణ వాయిదా
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వెల్ఫేర్ స్కీంలను ఉచితాలుగా పేర్కొనలేమని డీఎంకే వాదిం చింది. దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. ‘‘ఉచిత హామీల అంశం పై సిబల్, వికాస్ సింగ్లు ఇప్పుడు ఎలాంటి సూచనలు ఇవ్వలేరు. అందుకే దీనిపై రేపు విచారిద్దాం” అని చెప్పారు. దీనిపై పిటిషనర్ స్పందిస్తూ.. ‘‘సుప్రీం కోర్టు ఈ అంశాన్ని పరిగణ లోకి తీసుకుని ఓ కమిటీ వేయాలని” కోరారు.
డీఎంకే తరఫు అడ్వొకేట్ పి.విల్సన్ మాట్లాడు తూ.. ‘‘ఇండియా సోషలిస్ట్ వెల్ఫేర్ స్టేట్. మేము ఇంటర్వెన్షన్ అప్లికేషన్ ఫైల్ చేశాం. సంక్షేమ పథకాలు కీలకం. కమిటీ ఏర్పాటు నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం” అని చెప్పారు. మీకు వ్యతిరేకించే అర్హత ఉందని, అలా అని మేము ఆర్డర్ పాస్ చేయకుండా ఉండలేం అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల పేరుతో కొన్ని పార్టీలు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని కొందరు విమర్శిస్తున్నారని, కానీ వాటినే మరికొందరు వెల్ఫేర్ స్కీంలు అంటున్నారని అభిప్రాయపడ్డారు.
అందుకే ఉచితాలపై అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. శనివారంలోగా తమ సూచనలు తెలియజేయాలని రాజకీయ పార్టీలను ఆదేశిస్తూ.. విచారణను ఆగస్టు 22కు వాయిదా వేశారు. అశ్వినీ ఉపాధ్యాయ్ పిటిషన్ను ఆమ్ ఆద్మీ పార్టీ తరఫు అడ్వొకేట్ ఏఎం సింఘ్వీతో పాటు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లీడర్ జయ ఠాకూర్ వ్యతిరేకించారు.