- 103వ రాజ్యాంగ సవరణను సమర్థించిన సుప్రీంకోర్టు బెంచ్
- అనుకూలంగా జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ త్రివేది, జస్టిస్ పర్దీవాలా
- వ్యతిరేకంగా జస్టిస్ భట్ తీర్పు.. ఏకీభవించిన సీజేఐ
- స్వాగతించిన బీజేపీ, కాంగ్రెస్
న్యూఢిల్లీ: అగ్రకులాల్లోని ఆర్థికంగా బలహీన వర్గాల(ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యాసంస్థల్లో అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. ఈ రిజర్వేషన్లలో ఎలాంటి వివక్ష లేదని చెప్పింది. కేంద్ర నిర్ణయం రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించదని అభిప్రాయపడింది. ఐదుగురు సభ్యుల బెంచ్3:2 మెజారిటీతో తీర్పు చెప్పింది. 103వ రాజ్యాంగ సవరణ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన 40 పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నాలుగు వేర్వేరు తీర్పులు చెప్పింది. 35 నిమిషాలపాటు చదివి వినిపించింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ జేబీ పర్దీవాలా సమర్థించగా.. జస్టిస్ ఎస్.రవీంద్ర భట్ వ్యతిరేకించారు. జస్టిస్ భట్ అభిప్రాయంతో సీజేఐ జస్టిస్ లలిత్ ఏకీభవించారు.
సామాజిక న్యాయానికి ఎదురుదెబ్బ: స్టాలిన్
ఉద్యోగాలు, విద్యావకాశాల్లో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.. శతాబ్దాల సామాజిక న్యాయ పోరాటానికి తగిలిన ఎదురు దెబ్బ అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. సామాజిక న్యాయాన్ని కాపాడుకునేందుకు తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. తీర్పును విశ్లేషించిన తర్వాత న్యాయ నిపుణులను సంప్రదిస్తామని తెలిపారు.
సామాజిక న్యాయ గెలుపు: బీజేపీ
సుప్రీం తీర్పుతో.. దేశంలోని పేదలకు సామాజిక న్యాయం అందించాలనే ప్రధాని మోడీ మిషన్ విజయవంతమైందని బీజేపీ చెప్పింది. ‘కులతత్వ’ తీర్పు అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఉదిత్ రాజ్ చేసిన ఆరోపణపై మండిపడింది. ఇది ప్రతిపక్ష పార్టీకి ఉన్న పేదల వ్యతిరేక ఆలోచనను తెలియజేస్తున్నదని విమర్శించింది.
యూపీఏ ఘనతే: కాంగ్రెస్
సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. 2005–2006లో యూపీఏ ప్రభుత్వం.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ప్రాసెస్ ప్రారంభించిందని చెప్పింది. ఇందుకోసం సిన్హో కమిషన్ ఏర్పాటు చేసిందని, కమిషన్ తన రిపోర్టును 2010 జులైలో ఇచ్చిందని తెలిపింది. విస్తృత సంప్రదింపుల తర్వాత 2014లోనే తాము బిల్లును రెడీ చేశామని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అన్నారు. కానీ ఈ బిల్లును చట్టంగా మార్చేందుకు మోడీ ప్రభుత్వానికి ఐదేండ్లు పట్టిందన్నారు. 2012లోనే తాము సామాజిక -ఆర్థిక, కులగణన పూర్తి చేశామని, మరి ఇప్పుడు కుల గణనపై ప్రభుత్వం పొజిషన్ ఏంటో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ టైమ్లైన్
- 2019 జనవరి 8: 103వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభ ఆమోదించింది.
- జనవరి 9: రాజ్యసభ ఆమోదించింది.
- జనవరి 12: బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. నోటిఫై చేసిన కేంద్ర న్యాయ శాఖ.
- ఫిబ్రవరి 1: సుప్రీంకోర్టులో సవాలు
- ఫిబ్రవరి 6: ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు
- ఫిబ్రవరి 8: 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ
- 2022 సెప్టెంబర్ 8: అన్ని పిటిషన్లపై విచారణ జరిపేందుకు సీజేఐ జస్టిస్ లలిత్ ఆధ్వర్యంలో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు.
- సెప్టెంబర్ 13: వాదనలు ప్రారంభం
- సెప్టెంబర్ 27: తీర్పు రిజర్వు
- నవంబర్ 7: 3:2 మెజారిటీతో రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్పు
జడ్జిలు ఏం చెప్పారంటే..
సమసమాజం వైపు అడుగు.. జస్టిస్ మహేశ్వరి
కేంద్రం చేసిన రాజ్యాంగ సవరణ.. సమాన త్వాన్ని, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించదు. ఈ రిజర్వేషన్.. ప్రజలంతా కలిసి సమసమాజ లక్ష్యాన్ని చేర్చేందుకు తీసుకున్న చర్య. రిజర్వేషన్లలో 50% పరిమితి అనేది ఎప్పుడూ ఒకేలా ఉండాలని లేదు.
వివక్ష పేరుతో కొట్టేయలేం: జస్టిస్ త్రివేది
103వ రాజ్యాంగ సవరణ.. ఈడబ్ల్యూఎస్ వర్గాల ప్రయోజనంకోసమే కేంద్రం ఆమోదించిన చర్యగా పరిగణించాలి. సమానులను అసమానంగా పరిగణించనట్లే.. అసమానతలను సమానంగా చూడలేము. అది సమానత్వాన్ని ఉల్లంఘించడమే. ఈడబ్ల్యూఎస్ కింద పొందే ప్రయోజనం.. వివక్షతో కూడుకున్నదని చెప్పలేం.
సామాజిక న్యాయం కోసం : జస్టిస్ పర్దీవాలా
సామాజిక న్యాయం కోసమే ఈ రిజర్వేషన్ తెచ్చారు. కానీ దీన్ని ఎక్కువ కాలంపాటు కొనసాగించకూడదు. 10 సంవత్సరాల పాటు రిజర్వేషన్ తీసుకురావాలనేది డాక్టర్ అంబేద్కర్ ఆలోచన. కానీ అది కొనసా గింది. రిజర్వేషన్లను స్వార్థ ప్రయోజనాల కోసం అనుమతించకూడదు.
రాజ్యాంగ విరుద్ధం: జస్టిస్ భట్
103వ సవరణ.. రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘిస్తుంది. రిజర్వేషన్ అనేది ‘సమాన అవకాశాలు’ అనే విషయానికి విరుద్ధం. 103వ సవరణలో వివక్ష కనిపిస్తున్నది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లో ఎక్కువ మంది ఎస్సీలు, ఓబీసీలే.
జస్టిస్ భట్ అభిప్రాయంతో సీజేఐ జస్టిస్ లలిత్ ఏకీభవించారు.