
- కౌన్సిలింగ్ ఆపేందుకు నిరాకరణ
- నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు
- విచారణ వచ్చే నెల 8కి వాయిదా
న్యూఢిల్లీ: వైద్యవిద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ ఎగ్జాం వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. కేంద్ర దర్యాప్తు సంస్థతో ఎంక్వైరీకి నో చెప్పింది. అలాగే, నీట్ –2024 కౌన్సిలింగ్ను నిలిపివేయడానికి నిరాకరించింది. ఈ వ్యవహారంపై దాఖలైన నాలుగు పిటిషన్లపై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కి నోటీసులు జారీచేసింది. దీనిపై రెండు వారాల్లోగావివరణ ఇవ్వాలని ఏజెన్సీని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 8కి వాయిదా వేసింది.
రేపు దేశవ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్ పిలుపు
నీట్ అవకతవకలపై నిరసనగా శుక్రవారం దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని కాంగ్రెస్ బుధవారం పిలుపునిచ్చింది. స్టూడెంట్స్కు న్యాయం జరగాలనే డిమాండ్తో రాష్ట్ర హెడ్క్వార్టర్స్లో నిరసన చేపట్టాలని పార్టీ స్టేట్యూనిట్స్కు సూచించింది.
ప్రియాంక గాంధీపై చర్యకు బీజేపీ డిమాండ్
నీట్ ఎగ్జామ్పై తప్పుడు ఆరోపణలు చేసిన స్టూడెంట్ వీడియో షేర్ చేసినందుకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. తన ఓఎంఆర్ చినిగిపోయిందని, తనకు తక్కువ మార్కులు వేశారంటూ ఆయుశీ పటేల్అనే స్టూడెంట్ కోర్టులో కూడా ఫేక్ డాక్యుమెంట్స్ సమర్పించిందని, తప్పుడు ఆరోపణలు చేసిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాల పేర్కొన్నారు. ఈ విషయాన్ని సాక్షాత్తు కోర్టే వెల్లడించిందని అన్నారు. ఆయుశీ వీడియోను షేర్ చేసినందుకు ప్రియాంకగాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.