కర్నాటక రాష్ట్ర గీతంపై జోక్యం చేసుకోలేం : సుప్రీంకోర్టు

కర్నాటక రాష్ట్ర గీతంపై జోక్యం చేసుకోలేం : సుప్రీంకోర్టు
  •     ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు 

న్యూఢిల్లీ: కర్నాటక అధికారిక రాష్ట్ర గీతం ‘జయ భారత జననీ తనుజాతే’ గానానికి సంబంధించి ఒక నిర్దిష్ట రాగం, సమయ పరిమితిని ఖరారు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను సమర్థిస్తూ గతంలో కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. రాష్ట్ర గీతం ‘నాద గీతే’ను ప్రముఖ సంగీత విద్వాంసుడు మైసూర్ అనంతస్వామి స్వరపరిచిన బాణీలోనే, రెండున్నర నిమిషాల వ్యవధిలో ఆలపించాలని కర్నాటక ప్రభుత్వం 2022  సెప్టెంబర్ 25న ఆదేశాలు జారీ చేసింది. 

ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌‌‌‌ను హైకోర్టు తోసిపుచ్చడంతో, గాయకుడు కిక్కేరి కృష్ణమూర్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌‌‌‌ను విచారించిన జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్.మహదేవన్‌‌‌‌ల ధర్మాసనం దీనిని కొట్టివేసింది. రాష్ట్ర గీతాన్ని ఆలపించే విషయంలో బాణీ (రాగం), సమయ వ్యవధి రెండింటిలోనూ ఏకరూపత ఉండటం ఎంతో అవసరమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదని పేర్కొంది.