పోరాటం చేసింది కమ్యూనిస్టులైతే... ఉత్సవాలు చేస్తున్నది బీజేపీ

పోరాటం చేసింది కమ్యూనిస్టులైతే... ఉత్సవాలు చేస్తున్నది బీజేపీ
  • పోరాటం కమ్యూనిస్టులది హడావుడి బీజేపీది
  • తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ సభలో సురవరం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ విమోచన పేరుతో బీజేపీ హడావుడి చూస్తుంటే ఊర్లో  పెళ్లికి కుక్కల హడావుడిలా ఉందని సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. ఆనాడు పోరాటం చేసింది కమ్యూనిస్టులైతే, ఇప్పుడు ఉత్సవాలు చేస్తున్నది నాడు పోరాటంలో లేని  బీజేపీ అని విమర్శించారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 74వ వారోత్సవాల సందర్భంగా సీపీఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ బహిరంగ సభ నిర్వహించారు. 

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సభలో సురవరం సుధాకర్ రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశీం, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, అజీజ్ పాషా, రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ, తదితరులు ప్రసంగించారు. పోలీసు చర్య కారణంగానే హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్రం వచ్చిందన్న చరిత్రను వక్రీకరిస్తున్నారని కోదండరామ్ అన్నారు. 

ప్రజాపోరాటం ఫలితంగానే హైదరాబాద్ సంస్థాన ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. తెలంగాణ విలీనం సందర్భంగా ఉత్సవాలు జరుపుతున్న బీజేపీ ప్రభుత్వం.. నాటి స్వాతంత్ర్య, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ఆర్ఎస్ఎస్, బీజేపీకి చెందిన ఒక్క పోరాట యోధుని పేరైనా చెబుతారా అని నారాయణ ప్రశ్నించారు.