కోహ్లీ నన్ను స్లెడ్జ్​ చేసినందుకు హ్యాపీగా ఫీలయ్యా!

కోహ్లీ నన్ను స్లెడ్జ్​ చేసినందుకు హ్యాపీగా ఫీలయ్యా!
  • నా వికెట్​ విలువ తెలుసు కాబట్టే రెచ్చగొట్టాడు: సూర్య

న్యూఢిల్లీ:  యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్​ 13వ సీజన్​ మ్యాచ్​లో రాయల్​ చాలెంజర్స్ బెంగళూరు​ కెప్టెన్ విరాట్​ కోహ్లీ తనను స్లెడ్జింగ్​ చేయడం సంతోషంగా అనిపించిందని  ముంబై ఇండియన్స్​ బ్యాట్స్​మన్​ సూర్యకుమార్​ యాదవ్​ అన్నాడు. ‘నేనే కాదు.. ప్రత్యర్థి ఎవరైనా సరే విరాట్​ అలానే కఠినంగా ఉంటాడు. ఏదేమైనా కోహ్లీ నన్ను స్లెడ్జ్​ చేయడం హ్యాపీగా అనిపించింది. నా వికెట్ విలువ తెలుసుకున్నందు వల్లే విరాట్​ నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. నేను క్రీజులో ఉంటే మా టీమ్​ గెలుస్తుందని తనకీ తెలుసు. దాంతో నన్ను ఔట్​ చేస్తే వాళ్లకి చాన్సు ఉంటుందని అలా చేసి ఉంటాడు. పిచ్​ మీద నేను చాలా కూల్​గా ఉంటా. స్లెడ్జింగ్​ లాంటి వాటికి దూరంగా ఉంటా. కానీ  అబుదాబిలో ఆ రోజు పరిస్థితి వేరు. దాని వల్లే నువ్వా నేనా అన్నట్లు ప్రవర్తించాల్సి వచ్చింది. అదంతా  ఆ కొంచెం సేపటి వరకే. మ్యాచ్​ అయ్యాక అంతా మామూలే. కోహ్లీ కూడా బాగా ఆడావు అని నన్ను మెచ్చుకున్నాడు’ అని సూర్యకుమార్​ చెప్పుకొచ్చాడు.

నా ఆట నేను ఆడా..

అహ్మదాబాద్​లో ఇంగ్లండ్​తో తన డెబ్యూ టీ20లో  క్రీజులోకి వచ్చేముందు చాలా టెన్షన్​ ఫీలైనట్లు  సూర్య వెల్లడించాడు. ‘బ్యాటింగ్​ కోసం రెడీ అయ్యి డ్రెస్సింగ్​రూమ్​ నుంచి డగౌట్​కు వచ్చేటప్పుడు కూడా చాలా టెన్షన్​ ఫీలయ్యా. నేను అలా టెన్షన్​ పడకపోయి ఉంటే బాగా పెర్ఫామ్​ చేసేవాడ్ని కాదనుకుంటా. చివరికి క్రీజులోకి వెళుతుండగా..గతంలో మూడో ప్లేస్‌‌లో బ్యాటింగ్​ చేసినప్పుడు ఏమేం చేశానో వాటిని గుర్తు చేసుకున్నా. దాంతో నేను నా ఆట ఆడాలని డిసైడయ్యా. కొత్తగా ఏం ట్రై చెయ్యకు.. నువ్వు నీలానే ఉండు​ అని మనసులో అనుకుని మోటివేట్​అయ్యాను’ అని సూర్యకుమార్​ గుర్తు చేసుకున్నాడు.