న్యూఢిల్లీ: వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీని జట్టులోకి ఎంపిక చేసినప్పుడు ఐర్లాండ్తో సిరీస్లో బరిలోకి దించుతారని అందరూ భావించారు. కానీ మేనేజ్మెంట్ మరోలా ఆలోచించింది. సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వడంతో వైభవ్ ఎంట్రీ ఆలస్యమైంది. దాని ఫలితంగా ఐర్లాండ్తో రెండు మ్యాచ్ల సిరీస్ టీమిండియా బొక్కబోర్లా పడింది. ఈ నేపథ్యంలో జులై 1 నుంచి ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభమవుతోంది.
కనీసం ఇందులోనైనా సూర్యవంశీని ఆడిస్తారా..? లేక పాత పద్ధతులను కొనసాగిస్తారా..? అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. టీ20 వరల్డ్ కప్లో రాణించిన సంజూ శాంసన్, అభిషేక్ శర్మ జోడీ ఓపెనర్లుగా ఉన్నందున సూర్యవంశీకి చోటు దక్కలేదన్నది వాస్తవం. కానీ ఐర్లాండ్ చేతిలో రెండు మ్యాచ్ల్లో ఓడిపోవడంతో ఇప్పుడు సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. గంభీర్ నేతృత్వంలోని మేనేజ్మెంట్ పట్టుదలకు పోకుండా వైభవ్ను జట్టులోకి తీసుకోవడం మినహా మరో మార్గం కనిపించడం లేదు.
రొటేషన్ చేయాలి..
కొత్త ప్లేయర్లుకు జట్టులో చోటు కల్పించాలంటే పాత వారిని రొటేషన్లో ఆడించాలని లెజెండరీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పష్టం చేశాడు. అప్పుడే జట్టు ఎంపికపై ఓ స్పష్టత వస్తుందన్నాడు. ‘ఐర్లాండ్ సిరీస్లోనే సూర్యవంశీని ఆడించాల్సింది. ఒక మ్యాచ్లో అభిషేక్, మరో మ్యాచ్లో శాంసన్కు విశ్రాంతినిచ్చి యువ ఆటగాడికి అవకాశం ఇవ్వాల్సింది.
ఇంగ్లండ్తో జరిగే మొదటి మ్యాచ్ నుంచే సూర్యవంశీని ఖచ్చితంగా బరిలోకి దింపాలి. ఫామ్లో లేని ఆటగాళ్లను పక్కన పెట్టాలి. ఒకవేళ ఓపెనర్లను మార్చకూడదనుకుంటే, అతడిని మూడో స్థానంలోనైనా ఆడించాలి. ఇంగ్లండ్కు షాక్ ఇవ్వాలంటే సూర్యవంశీ ఆడటం అవసరం’ అని గావస్కర్ విశ్లేషించారు. వైభవ్ సూర్యవంశీని మూడో ప్లేస్లో ఆడించడంతో పాటు ఆ తర్వాత వరుసగా ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్ను దించాలి.
ఈ స్ట్రాటజీ ప్రకారం సూర్యాన్ష్ షెడ్గే మొదటి మ్యాచ్కు దూరమవ్వాల్సి వస్తుంది. అయితే ఈ కూర్పులో శివమ్ దూబే ఏడో స్థానంలో వస్తే, అతడు నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేయాల్సి ఉంటుంది. దూబే పూర్తిస్థాయి బౌలర్ కాకపోవడం, కేవలం ఆరో బౌలర్గా మాత్రమే ఉపయోగపడటం జట్టుకు పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంది.
ఐపీఎల్ పిచ్లతోనే అసలు లోపం..
ఇండియా బ్యాటర్లు ఐపీఎల్లో 'నేషనల్ హైవేస్' లాంటి ఫ్లాట్ పిచ్లపై ఆడి, అక్కడ 'ఇంపాక్ట్ ప్లేయర్' వెసులుబాటుతో చెలరేగిపోతున్నారు. కానీ అంతర్జాతీయ మ్యాచ్ల్లో బౌలింగ్కు అనుకూలించే పిచ్లు ఎదురైనప్పుడు ప్రత్యామ్నాయ వ్యూహాలు (ప్లాన్ బి) లేక తడబడుతున్నారు. సూర్యవంశీని జట్టులోకి తెస్తూనే, ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలంటే ఇషాన్ కిషన్ లేదా తిలక్ వర్మలలో ఒకరిని పక్కన పెట్టాల్సి ఉంటుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత సమంజసమైన నిర్ణయం ఏంటంటే.. సంజూ శాంసన్ను పక్కన పెట్టడమే. ఐర్లాండ్ సిరీస్లో ఒక మ్యాచ్లో 5 పరుగులు, మరో మ్యాచ్లో డకౌట్ అయిన శాంసన్, బౌలింగ్కు అనుకూలించిన పిచ్లపై సాంకేతికంగా విఫలమయ్యాడు. జట్టు బౌలింగ్ సమతుల్యత దెబ్బతినకుండా సూర్యవంశీని జట్టులోకి తేవాలంటే మేనేజ్మెంట్ శాంసన్తో మాట్లాడాల్సి ఉంటుంది. జట్టు భవిష్యత్తు కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు.
