- వృథాగా రూ.44 లక్షల స్వీపింగ్ మిషన్
- రోడ్ల మీద పేరుకుపోతున్న మట్టి, ఇసుక.. పట్టించుకోని అధికారులు
మెదక్, వెలుగు : మెదక్ పట్టణంలోని రోడ్ల మీద పేరుకునే మట్టి, ఇసుకను తొలగించేందుకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఆరంభంలో రూ.44 లక్షలతో స్మార్ట్ స్వీపింగ్ మిషన్ కొన్నారు. దానిని కొన్నాళ్లు వృథాగానే ఉంచారు. ఆ తర్వాత మార్చిలో మంత్రి హరీశ్ రావు ప్రారంభించడంతో కొద్ది రోజులే వాడి మళ్లీ మూలకు పెట్టారు. దీంతో లక్షల రూపాయలు పెట్టి కొన్న మిషన్ నెలల తరబడి నిరుపయోగంగా ఉండడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు.
రోడ్లపై భారీగా మట్టి, ఇసుక..
మెదక్ పట్టణంలో రోడ్ల మీద పెద్ద మొత్తంలో మట్టి, ఇసుక పేరుకుపోయింది. పట్టణంలో మూడు కిలోమీటర్ల పొడవునా మెయిన్ రోడ్డు ఉండగా, ఇతర పలు బీటీ రోడ్లు ఉన్నాయి. రోజూ పెద్ద సంఖ్యలో వెహికల్స్ తిరుగుతుంటాయి. రోడ్డు విస్తరణ పనులు అసంపూర్తిగా ఉండటంతో ఆటో నగర్ లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. ఇటీవల భారీ వర్షాలు కురిసి ఆ ఏరియాలో మెయిన్ రోడ్డు మొత్తం జలమయమైంది. మహబూబ్ నహర్ కాల్వ పొంగిపొర్లి వెంకట్రావ్ నగర్, సాయినగర్ కాలనీల మీదుగా పెద్ద మొత్తంలో వరద రావడంతో ఆటోనగర్లో రెండు వైపులా మెయిన్ రోడ్డు మీద భారీగా మట్టి, ఇసుక చేరింది. దీంతో బీటీ రోడ్డు మట్టి రోడ్డులా కనిపిస్తోంది.పెద్ద వెహికల్స్ వెళ్లిననప్పుడు వాహనదారులు, నడుచుకుంటూ వెళ్లేవారిపై దుమ్ము పడుతోంది. ఇసుక కారణంగా కొన్నిచోట్ల బైక్లు స్కిడ్ అయి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అధికారులు స్పందించి స్వీపింగ్ మిషన్ ను వినియోగించాలని, పట్టణంలోని రోడ్లన్నీ శుభ్రంగా ఉండేలా చూడాలని పలువురు కోరుతున్నారు.