న్యూఢిల్లీ: స్విగ్గీలో పనిచేసేవారికి గుడ్న్యూస్! ఈ ఫుడ్ ఆర్డరింగ్ డెలివరీ ప్లాట్ఫారమ్ మొట్టమొదటిసారిగా 'మూన్లైటింగ్ పాలసీ'ని ప్రవేశపెట్టింది. ఇక నుంచి స్విగ్గీ ఉద్యోగులు అదనపు ఆదాయం- కోసం ఇతర ప్రాజెక్ట్లను తీసుకోవచ్చు. ఇందుకు ఇంటర్నల్ అప్రూవల్స్ అవసరం. ఉద్యోగులు కొన్ని షరతులు పాటిస్తేనే రెండవ ఉద్యోగం/పని చేయడానికి అనుమతి ఇస్తారు. ఆఫీస్ సమయం ముగిశాక లేదా వారాంతాల్లో ఇలాంటి పనులు చేసుకోవచ్చు. ప్రస్తుత జాబ్పై ఎలాంటి ఎఫెక్ట్ ఉండకూడదు. ప్రొడక్టివిటీ దెబ్బతినని పద్ధతిలో ఇతర వర్క్ చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. దేశవ్యాప్త లాక్డౌన్ల సమయంలో చాలా మంది కొత్త అలవాట్లను నేర్చుకున్నారని, అదనపు ఆదాయ వనరులను అందించే పనులను మొదలుపెట్టారని, అందుకే ఈ విధానాన్ని తెచ్చామని స్విగ్గీ తెలిపింది. "మా ఉద్యోగులు ఒక ఎన్జీఓలో వలంటీర్గా పనిచేయవచ్చు. డ్యాన్స్ ట్రైనర్ లేదా సోషల్ మీడియా కోసం కంటెంటర్ వంటి పనులు చేసుకోవచ్చు.
అటువంటి ప్రాజెక్ట్లలో పనిచేయడం వల్ల వాళ్ల కెరీర్కు, కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది” అని పేర్కొంది. స్విగ్గీ జాబ్పై ఎఫెక్ట్ చూపే లేదా ఎక్కువ ప్రమాదకర ప్రాజెక్ట్లలో పనిచేయాలంటే ముందస్తు ఆమోదం తీసుకోవడం తప్పనిసరి. స్విగ్గీ సబ్సిడరీలు, అనుబంధ సంస్థలు, అసోసియేట్ గ్రూప్ కంపెనీలతో సహా బండిల్ టెక్నాలజీస్ ఉద్యోగులందరికీ ఈ పాలసీ వర్తిస్తుంది. బండిల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ స్విగ్గీ యాప్ని నడుపుతోంది. ప్రపంచ స్థాయి 'పీపుల్ ఫస్ట్' సంస్థను నిర్మించే దిశగా తమ ప్రయాణంలో ఇది మరో మైలురాయి అని స్విగ్గీ హెచ్ఆర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ గిరీష్ మీనన్ అన్నారు. ఇదిలా ఉంటే తమ ఉద్యోగులు ఎక్కడి నుంచి అయినా పర్మనెంట్ విధానంలో పనిచేసుకోవడానికి అనుమతిస్తున్నట్టు పోయినవారం స్విగ్గీ ప్రకటించింది.