స్విగ్గీలో పనిచేసేవారికి గుడ్​న్యూస్​!

స్విగ్గీలో పనిచేసేవారికి గుడ్​న్యూస్​!

న్యూఢిల్లీ: స్విగ్గీలో పనిచేసేవారికి గుడ్​న్యూస్​!  ఈ ఫుడ్ ఆర్డరింగ్  డెలివరీ ప్లాట్‌‌‌‌ఫారమ్ మొట్టమొదటిసారిగా 'మూన్‌‌లైటింగ్ పాలసీ'ని ప్రవేశపెట్టింది. ఇక నుంచి స్విగ్గీ ఉద్యోగులు అదనపు ఆదాయం- కోసం ఇతర ప్రాజెక్ట్‌‌లను తీసుకోవచ్చు.  ఇందుకు ఇంటర్నల్ అప్రూవల్స్​ అవసరం. ఉద్యోగులు కొన్ని షరతులు పాటిస్తేనే రెండవ ఉద్యోగం/పని చేయడానికి అనుమతి ఇస్తారు. ఆఫీస్ సమయం ముగిశాక లేదా వారాంతాల్లో ఇలాంటి పనులు చేసుకోవచ్చు. ప్రస్తుత జాబ్​పై ఎలాంటి ఎఫెక్ట్​ ఉండకూడదు. ప్రొడక్టివిటీ దెబ్బతినని పద్ధతిలో ఇతర వర్క్​ చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. దేశవ్యాప్త లాక్‌‌డౌన్‌‌ల సమయంలో చాలా మంది కొత్త అలవాట్లను నేర్చుకున్నారని, అదనపు ఆదాయ వనరులను అందించే పనులను మొదలుపెట్టారని, అందుకే ఈ విధానాన్ని తెచ్చామని స్విగ్గీ తెలిపింది. "మా ఉద్యోగులు ఒక ఎన్జీఓలో వలంటీర్​గా పనిచేయవచ్చు. డ్యాన్స్​  ట్రైనర్​ లేదా సోషల్ మీడియా కోసం కంటెంటర్​ వంటి పనులు చేసుకోవచ్చు.  

అటువంటి ప్రాజెక్ట్‌‌లలో పనిచేయడం వల్ల వాళ్ల కెరీర్​కు, కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది” అని పేర్కొంది.  స్విగ్గీ  జాబ్​పై ఎఫెక్ట్ చూపే లేదా  ఎక్కువ ప్రమాదకర ప్రాజెక్ట్‌‌లలో పనిచేయాలంటే ముందస్తు ఆమోదం తీసుకోవడం తప్పనిసరి. స్విగ్గీ సబ్సిడరీలు, అనుబంధ సంస్థలు, అసోసియేట్  గ్రూప్ కంపెనీలతో సహా బండిల్​ టెక్నాలజీస్ ఉద్యోగులందరికీ ఈ పాలసీ వర్తిస్తుంది. బండిల్​ టెక్నాలజీస్​ ప్రైవేట్​ లిమిటెడ్​ స్విగ్గీ  యాప్‌‌ని నడుపుతోంది.  ప్రపంచ స్థాయి 'పీపుల్ ఫస్ట్' సంస్థను నిర్మించే దిశగా తమ ప్రయాణంలో ఇది మరో మైలురాయి అని స్విగ్గీ హెచ్​ఆర్​ సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ గిరీష్ మీనన్ అన్నారు. ఇదిలా ఉంటే తమ ఉద్యోగులు ఎక్కడి నుంచి అయినా పర్మనెంట్​ విధానంలో పనిచేసుకోవడానికి అనుమతిస్తున్నట్టు పోయినవారం స్విగ్గీ  ప్రకటించింది.