సరుకులు కొనేసుకొని కౌంటర్ కు వెళ్లకుండా ఇంటికి పోతే ఎట్లుంటది!
బిజినెస్ డెస్క్, వెలుగు: అసలు స్టాఫే లేని గ్రోసరీ స్టోర్కి వెళ్లి, మనకు కావాల్సిన ఐటమ్లు తీసుకుని, బిల్లింగ్ కౌంటర్లో వేచి చూడాల్సినవసరం లేకుండా బయటికి వచ్చామనుకోండి.. వింటుంటే భలే బాగుంది కదా.. అమెరికాలో ఇప్పటికే ఇలాంటి స్టోర్లు రన్ అవుతున్నాయి. ఆన్లైన్ కంపెనీ అమెజాన్ గో స్టోర్ల పేరిట వీటిని నడుపుతోంది. చైనాలో కూడా బింగోబాక్స్ ఇలాంటి స్మార్ట్ స్టోర్లనే షాంఘై, బీజింగ్లో రన్ చేస్తోంది. ఈ స్టోర్లలో ఐటమ్స్ను కస్టమర్లు తీసుకున్న తర్వాత.. మీ మొబైల్ డివైజ్లోని పేమెంట్ యాప్ బిల్లు జనరేట్ కోసం సెన్సర్లకు కమ్యూనికేట్ చేస్తోంది. మీరు షాపు నుంచి బయటికి రాగానే మీ చేతిలోని ఐటమ్స్కు బిల్లు చెల్లింపు పూర్తవుతుంది. ఇక ఇప్పుడు ఇలాంటి కొత్త ఇనోవేషన్సే ఇండియాలో కూడా రాబోతున్నాయి. ఎంట్రప్రెన్యూర్లు, రీసెర్చర్లు, ఇంజనీర్లు, టెక్నాలజీ కంపెనీలు అందరూ కలిసి ఇండియన్ పేమెంట్స్ సిస్టమ్ను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇండియాలో డిమానిటైజేషన్ తర్వాత డిజిటల్ పేమెంట్స్ అడాప్షన్ సెకండ్ వేవ్ ప్రారంభమైంది. స్మార్ట్ఫోన్ ఆధారిత పేమెంట్స్ సొల్యూషన్స్ పెరిగాయి. కరోనా మహమ్మారి తర్వాత ఎన్ఎఫ్సీ, క్యూఆర్ కోడ్, టోకెనైజేషన్ వంటి టెక్నాలజీస్ పేమెంట్ ప్రపంచానికి పరిచయం అయ్యాయి.
పేమెంట్ ఇండస్ట్రీలో ఉన్న ట్రెడిషనల్ బ్యాంక్ల నుంచి న్యూ ఏజ్ ఫిన్టెక్స్ వరకు ప్రతి కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఇనోవేషన్స్ను తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొత్త కొత్త టెక్నాలజీలను కూడా పేమెంట్ ఇండస్ట్రీ ఒకవైపు నుంచి పరీక్షిస్తూనే ఉంది. కేవలం సౌకర్యవంతమైన సొల్యూషన్స్ అందించడమే కాకుండా.. ఒక స్థిరమైన బిజినెస్ విధానాలతో పెద్ద మొత్తంలో కస్టమర్లను అందిపుచ్చుకోవాలని పేమెంట్ ఇండస్ట్రీ లోని కంపెనీలు చూస్తున్నాయి. కాంటాక్ట్లెస్ పేమెంట్ల కోసం ఆర్బీఐ రెగ్యులేషన్స్ను కూడా సరళతరం చేసింది. కరోనా మహమ్మారి తర్వాత బ్యాంకింగ్, పేమెంట్ ఇండస్ట్రీ మాస్ మార్కెట్ ఇనోవేషన్ కోసం చూస్తోందని ఇండస్ట్రీ లీడర్లన్నారు. ఇండస్ట్రీ లీడర్ల ప్రకారం ప్రస్తుతం ఈ రంగం క్యూఆర్ కోడ్స్, ఎన్ఎఫ్సీ, టోకెనైజేషన్ వంటి మూడు రకాలైన కొత్త టెక్నాలజీలపై పనిచేస్తోంది. మొబైల్ ఫోన్ల అడాప్షన్ పెరగడం, ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరింత విస్తరించడంతో ఈ రంగంలో మరిన్ని ఇనోవేషన్లను చూడొచ్చని పైన్ ల్యాబ్స్ సీఈవో అమ్రిష్ రావు అన్నారు. క్యూఆర్ పేమెంట్స్, ఎన్ఎఫ్సీ ఆధారిత లావాదేవీలు మరింత ముందుకు వెళ్తాయని చెప్పారు. టెక్నాలజీలు కూడా కన్జూమర్లకు అనుకూలంగా ఉండాలని, ముఖ్యంగా మిలీనియల్స్ను దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్, ఆఫ్లైన్ పేమెంట్ విధానాలను తేవాలని రావు చెప్పారు. పైన్ ల్యాబ్స్ కొత్త యూపీఐ టెక్నాలజీతో పేమెంట్ టైమ్ను సుమారు 20 సెకండ్లు తగ్గించిందని రావు తెలిపారు.
కార్డు లావాదేవీల్లో ఎన్ఎఫ్సీలు..
ఎన్ఎఫ్సీలను ముఖ్యంగా కార్డు లావాదేవీల్లో వాడుతున్నారు. కార్డును స్వైప్ చేయాల్సినవసరం లేకుండా, పిన్ ఎంటర్ చేయకుండా కేవలం కార్డులను మిషన్ పైన తాకిస్తే చాలు లావాదేవీ పూర్తవుతుంది. సాధారణ కార్డులతో పోలిస్తే ఇది అత్యంత సురక్షితం. ఎక్కడా కూడా కార్డు పిన్ నెంబర్ బయటికి వెళ్లదు. టోకెనైజేషన్ టెక్నాలజీ ద్వారా స్మార్ట్ఫోన్లలోనే వర్చ్యువల్ కార్డులను వాడుకోవచ్చు. అంటే పదే పదే కార్డు వివరాలను ఎంటర్ చేయాల్సినవసరం ఉండదు. సెన్సిటివ్ కార్డు డేటాను యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్తో రిప్లేస్ చేసుకోవచ్చు. దీని ద్వారా ప్లాస్టిక్ కార్డుల నుంచి బ్యాంక్లు బయటికి రాగలవని ఎస్ఎంఈ పేమెంట్ ప్లాట్ఫామ్ మిన్టోక్ సీఈవో రమన్ ఖందుజ అన్నారు. ఆస్ట్రేలియా, యూకే, సింగపూర్లలో చాలా కార్డు లావాదేవీలు టోకెనైజేషన్, ఎన్ఎఫ్సీ ఆధారంగానే జరుగుతున్నాయి. స్మార్ట్ఫోన్ల ద్వారానే డైరెక్ట్గా ఎన్ఎఫ్సీ ఆధారిత పేమెంట్లను మర్చెంట్లు అంగీకరించేలా యాక్సిస్ బ్యాంక్, మాస్టర్కార్డు, వీసాలతో కలిసి పనిచేస్తోంది. కరోనా కాలం డిజిటల్ పేమెంట్స్ ఇండస్ట్రీకి మంచి అవకాశాన్ని తీసుకొచ్చింది.
టైటాన్తో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జతకట్టింది. స్మార్ట్ వాచ్ తో తొలి కాంటాక్ట్లెస్ పేమెంట్ జరిగేలా ఈ రెండు కృషి చేయనున్నాయి.
మర్చంట్ కామర్స్ ప్లాట్ ఫామ్స్ పైన్ ల్యాబ్స్ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్(ఎన్ఎఫ్ సీ) ఆధారిత పేమెంట్ టెక్నాలజీ కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ)తో కలిసి పనిచేస్తోంది. స్టిక్కర్స్ స్కాన్ చేయాల్సినవసరం లేకుండా నే యూపీఐ క్యూఆర్తో పేమెంట్స్ జరిగేలా ఇది యూజర్లకు అనుమతించనుంది.
సిటీ క్యాష్ కాంటాక్ట్లెస్ టెక్నాలజీ ద్వారా బిల్లు సొల్యూషన్స్ ను అందిస్తోంది.
టోకెనైజేషన్ వాడుతూ తమ యాప్ లలో వర్చ్యువల్ కార్డులను ప్రవేశపెట్టేందుకు గూగుల్ పే, ఫోన్పేలు పనిచేస్తున్నాయి.
13కి పైగా మెట్రో ప్రాజెక్ట్లలో బ్యాంక్లతో కలిసి కాంటాక్ట్లెస్ పేమెంట్లు పైలట్ సర్వీసులను వీసా, మాస్టర్ కార్డులు ప్రారంభించాయి.
ఎన్ఎఫ్ సీతో కలిసి కాంటాక్ట్లెస్ పార్కింగ్ పేమెంట్స్ కోసం ఎన్పీసీఐ, ఐసీఐసీఐ బ్యాంక్లు కలిసి పనిచేస్తున్నాయి.