
మోడీ కొత్త కేబినెట్లో ఎవరికి చోటు దక్కనుంది? ఎవరెవరు మంత్రులు కానున్నారు? పలువురు ముఖ్య నేతలకు కీలక శాఖలు దక్కే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. గురువారం రాత్రి 7 గంటలకు ప్రధానిగా మోడీ, మరికొందరు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్లోకి ఎవరెవరిని తీసుకోవాలన్న దానిపై మోడీ, అమిత్ షా బుధవారం సమావేశమై చర్చించారు. అమిత్ షా ఇంట్లో సుమారు నాలుగు గంటల పాటు ఈ భేటీ జరిగింది. కొందరు ముఖ్య నేతలు కూడా ఇందులో పాల్గొన్నారు. సమావేశంలోనే కేబినెట్ బెర్త్లకు పలువురి పేర్లు ఖరారు చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఆయా నాయకులను గురువారం ప్రమాణస్వీకారోత్సవానికి రావాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మంగళవారం కూడా మోడీ, షా సమావేశమై ఇదే అంశంపై చర్చించారు. ఎన్టీయేలోని భాగస్వామ్య పార్టీలైన శివసేన, జేడీయూకు ఈ సారి కేబినెట్లో అధిక ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది. అప్నాదళ్కు కూడా మరోసారి మంత్రి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు ఎక్కువ కేబినెట్ బెర్త్లు కేటాయిస్తారని సమాచారం. ఆయా రాష్ట్రాల్లో మొన్నటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు రాబట్టుకుంది. తెలంగాణలోనూ నాలుగు చోట్ల బీజేపీ గెలువడంతో ఇక్కడి నుంచి కూడా ఒకరికి మంత్రి పదవి ఇవ్వనున్నట్లు సమాచారం.
70 మందికిపైగా మంత్రులు?
వాస్తవానికి కేంద్ర కేబినెట్లో 80 మందికి చాన్స్ ఉంటుంది. దాదాపు ప్రతిసారి 60 నుంచి 70 లోపే మంత్రులతో కేబినెట్ కొనసాగుతోంది. అయితే.. ఈసారి మోడీ కేబినెట్లో 70 మందికిపైగా మంత్రులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాలుగైదు రాష్ట్రాలు మినహా దాదాపు అన్ని రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు రాబట్టుకుంది. అన్ని రాష్ట్రాలకు ఈ కేబినెట్లో అవకాశం కల్పించాలని మోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కేబినెట్ పరిధి పెరుగనుంది. గురువారం కొందరికి, అటు తర్వాత విస్తరణలో మరికొందరికి అవకాశం కల్పించనున్నారు. మరోవైపు అంతగా ప్రాధాన్యం లేని కొన్ని శాఖలను విలీనం చేయాలని ఆయన ఆలోచిస్తున్నారు. కొత్త మంత్రిత్వ శాఖలను కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అందులో డ్రింకింగ్ వాటర్ మిషన్ అనే కొత్త మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసే చాన్స్ ఉంది. గత కేబినెట్లో ఆయూష్ అనే కొత్త మంత్రిత్వ శాఖను మోడీ ఏర్పాటు చేశారు. ఈ సారి కేబినెట్లో వ్యవసాయ శాఖకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొన్నటివరకు వ్యవసాయ శాఖ మంత్రిగా రాధామోహన్సింగ్ కొనసాగారు.
ఆర్థిక మంత్రిగా షా లేదా గోయల్
తన ఆరోగ్యం బాగోలేదని, కేంద్ర కేబినెట్లో చేరబోనని మొన్నటి వరకు ఆర్థిక మంత్రిగా పనిచేసిన అరుణ్జైట్లీ మోడీకి లేఖ రాసిన నేపథ్యంలో ఆ మంత్రిత్వ శాఖను ఎవరికి ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈసారి బీజేపీ చీఫ్ అమిత్ షాను కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. కీలకమైన హోం, రక్షణ, ఆర్థిక, విదేశాంగ శాఖల్లో ఏదైనా ఒకటి షాకు దక్కొచ్చని నాలుగురోజులుగా వార్తలు వస్తున్నాయి. హోంమంత్రిగా ఆయనను తీసుకొని మొన్నటివరకు ఆ శాఖను నిర్వర్తించిన రాజ్నాథ్ను రక్షణ శాఖకు షిఫ్టు చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. అయితే.. హోంమంత్రిగా రాజ్నాథ్నే కొనసాగిస్తూ, ఆర్థిక శాఖను అమిత్ షాకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు అమిత్షా కేబినెట్లో చేరకుండా బీజేపీ చీఫ్గానే కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక శాఖ మంత్రిగా పీయూష్ గోయల్ పేరు సైతం వినిపిస్తోంది. మొన్నటి కేబినెట్లో జైట్లీ ఆరోగ్యం బాగోలేనప్పుడు ఇన్చార్జ్ ఆర్థిక మంత్రిగా గోయల్ పనిచేశారు. కొత్త కేబినెట్లో పలువురు యువ నేతలకు చాన్స్ దక్కనుంది. ఇందులో గంభీర్ వంటి పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. పాతవారిలో కొందరికి మళ్లీ చాన్స్ ఇవ్వనున్నారు. అందులో ముఖ్యంగా మొన్నటి లోక్సభ ఎన్నికల్లో అమేథీలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్గాంధీని ఓడించి విజయం సాధించిన స్మృతి ఇరానీకి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మహిళలకు అధిక ప్రాధాన్యం
మోడీ ఫస్ట్ టర్మ్ కేబినెట్లో ఎనిమిది తొమ్మిది మంది మహిళలు మంత్రులయ్యారు. గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో మహిళలు ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడంతో కేబినెట్లోనూ వారికి ఎక్కువ బెర్త్లు కేటాయించాలని మోడీ భావిస్తున్నారు. స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్, ఉమా భారతి, సుష్మా స్వరాజ్, నజ్మా హెప్తుల్లా, హర్సిమ్రత్ కౌర్ బాదల్, మేనకా గాంధీ, అనుప్రియా పటేల్వంటివారు మోడీ ఫస్ట్ టర్మ్లో మంత్రులుగా పనిచేశారు. ఆరోగ్యం సహకరించని కారణంగా ఈ సారి సుష్మాస్వరాజ్ కేబినెట్లో చేరేలా అవకాశం లేదు.
మిత్రపక్షాలకు ప్రయారిటీ
మహారాష్ట్రలో బీజేపీతో కలిసి పోటీ చేసిన శివసేన 18 ఎంపీ సీట్లు గెలుచుకుంది. బీహార్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన జేడీయూ 16 సీట్లు సాధించింది. యూపీలో బీజేపీతో కలిసి బరిలోకి దిగిన అప్నాదళ్ పోటీ చేసిన రెండు సీట్లలో విజయం సాధించింది. ఈ సారి కేబినెట్లో శివసేన, జేడీయూకు రెండు మూడు కేబినెట్ బెర్త్లు ఖాయమని తెలుస్తోంది. అప్నాదళ్కు గత కేబినెట్లో ఇచ్చినట్లే ఈసారి కూడా ఒక మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది.