కరోనా ఎఫెక్ట్ తరచూ తిరుమల శ్రీవారి భక్తులను నానా ఇబ్బందులకు గురి చేస్తోంది. కొవిడ్ మొదలైనప్పటి నుంచి భక్తులకు ఆఫ్లైన్ దర్శనం టికెట్లు దూరం కావడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారికి సమస్యలు ఎదురవుతున్నాయి. ఆన్లైన్లో మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, సర్వ దర్శనం టోకెన్లు అందుబాటులో ఉన్నప్పటికీ అవి పరిమిత సంఖ్యలోనే కావడంతో టీటీడీ వెబ్సైట్లో రిలీజ్ చేసిన కొన్ని నిమిషాల్లోనే అయిపోతున్నాయి. దీంతో పల్లె ప్రాంతాల భక్తులకు పెద్దగా ఆ టికెట్లు దక్కడం లేదు. పైగా వీటి గురించి అవగాహన లేని కొందరు భక్తులు తిరుపతి వరకూ వచ్చి.. తిరుమల శ్రీవారి కొండపైకి చేరుకోలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఇవాళ తిరుపతిలో చోటు చేసుకుంది.
తమిళనాడు నుంచి కాలినడకన వచ్చిన భక్తులు..
దర్శనం టికెట్లు లేవని, తిరుమలకు అనుమతించకపోవడంతో తిరుపతిలోని గరుడ సర్కిల్ ఆవరణలో తమిళనాడు భక్తులు ఆందోళనకు దిగారు. తమిళనాడు నుంచి కాలినడక వందలాదిగా అలిపిరికి చేరుకున్న భక్తులు చేరుకున్నారు .అయితే వారిలో దర్శన టికెట్ ఉన్న వారిని మాత్రమే టిటిడి సిబ్బంది తిరుమల అనుమతించారు. దర్శనం టోకెన్ లేని భక్తులను అనుమతించలేదు. దీంతో గరుడ సర్కిల్ ఆవరణలో రోడ్డుపై బైఠాయించి తమనూ కొండపైకి అనుమతించాలని కోరుతూ నిరసన కు దిగారు. గోవింద నామస్మరణ చేస్తూ తమ నిరసనను తెలిపారు. కాలినడకన శ్రీవారి దర్శనం కోసం వచ్చామని తమనూ కొండపైకి అనుమతించాలని అధికారులను కోరారు. అయితే ఎంతకూ కనికరించడంతో వారు వెనుదిరిగినట్లు తెలుస్తోంది.