నటుడిగా, రచయితగా, దర్శకుడిగా మెప్పిస్తున్నారు తనికెళ్ళ భరణి. నలభై ఏళ్లుగా దాదాపు ఎనిమిది వందలకుపైగా చిత్రాల్లో నటించిన ఆయన.. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ‘పెదకాపు’ చిత్రంలో ఓ వైవిధ్యమైన పాత్ర పోషించారు. విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ జంటగా మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 29న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా తనికెళ్ళ భరణి మాట్లాడుతూ ‘ఈ మధ్య కాలంలో చాలా వరకూ తండ్రి పాత్రలే చేశాను.
అవన్నీ రెగ్యులర్గా ఉండే పాత్రలే. కానీ ‘పెదకాపు’లో చాలా భిన్నమైన పాత్ర చేశా. చాలా ప్రాధాన్యత ఉంటుంది. స్కూల్ టీచర్గా సమాజంపై విసిగిపోయిన ఓ మేధావి పాత్ర. నా పాత్ర దర్శకుడి వాయిస్ని రిప్రజంట్ చేస్తుంది. జనం తరపున ప్రశ్నించే పాత్ర. చాలా రోజుల తర్వాత చేసిన వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ ఇది. నా కెరీర్లో మెమరబుల్గా నిలిచిపోతుంది. శ్రీకాంత్ అడ్డాల చిత్రాలలో తెలుగు దనం, గోదావరి జీవం, యాస ఉట్టిపడుతుంటుంది.
ఇందులో మాత్రం వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది. విరాట్ కర్ణ కొత్త వాడు అయినా తన పాత్రలో జీవించేశాడు. హీరోయిన్ ప్రగతికి బాబాయ్గా కనిపిస్తా. రొటీన్ కథలు వస్తున్నాయనే కారణంతో ఇటీవల పద్దెనిమిది సినిమాలు వదిలేసుకున్నా. ప్రస్తుతం శేఖర్ అనే కొత్త దర్శకుడితో చేస్తున్నా. కన్నడలో ప్రభుదేవా, శివరాజ్ కుమార్ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర చేశా. నా 40 ఏళ్ల కెరీర్లో దాదాపు అనుకున్నవన్నీ చేశాను. అయితే అంతర్జాతీయ స్థాయిలో ఒక సినిమా చేయాలనే కోరిక మాత్రం మిగిలుంది’ అని చెప్పారు.