- ఐఫోన్ అసెంబ్లింగ్ ప్లాంట్..
- తమిళనాడులో నిర్మించనున్న టాటా?
న్యూఢిల్లీ : టాటా గ్రూప్ ఐఫోన్ల అసెంబ్లీ యూనిట్ను నిర్మించేందుకు రెడీ అవుతోంది. యాపిల్ఫోన్లను అసెంబుల్ చేసే విస్ట్రాన్ కొనుగోలును ఈ ఏడాది పూర్తి చేసింది. ఈ డీల్ విలువ125 మిలియన్ డాలర్లు. దీనివల్ల టాటా భారతదేశంలో మొట్టమొదటి దేశీయ ఐఫోన్ తయారీదారుగా ఎదిగింది. టాటా గ్రూప్ భారతదేశంలో అతిపెద్ద ఐఫోన్ అసెంబ్లీ ప్లాంట్లలో ఒకదానిని నిర్మించాలని యోచిస్తోంది. టాటా ఇప్పటికే కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో ఉన్న విస్ట్రాన్ అసెంబ్లీ ప్లాంట్ను కొనుగోలు చేసింది.
తమిళనాడులోని హోసూర్లో రెండవ ఫ్యాక్టరీని నిర్మించాలని యోచిస్తోంది. కొత్త ఫ్యాక్టరీలో దాదాపు 20 అసెంబ్లీ లైన్లు ఉంటాయి. మొదటి రెండు సంవత్సరాలలో సుమారు 50వేల మందికి ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ వచ్చే 12 నుంచి 18 నెలల్లో పని చేయనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ఫ్యాక్టరీలతో పోలిస్తే రాబోయే ఐఫోన్ ఫ్యాక్టరీ మధ్యస్థ పరిమాణంలో ఉంటుందని భావిస్తున్నారు. పది వేల కంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న విస్ట్రాన్ నుంచి టాటా కొనుగోలు చేసిన దాని కంటే ఇది పెద్దది అవుతుంది.
రిక్రూట్మెంట్ షురూ
టాటాలు ఇండియాలో కొత్త ఫ్యాక్టరీని నిర్మించడమే కాకుండా, హోసూర్లోని దాని ప్రస్తుత ఫెసిలిటీలో రిక్రూట్మెంట్ను వేగవంతం చేస్తున్నారు. ఇక్కడ మెటల్ కేసింగ్లు లేదా ఐఫోన్ ఎన్క్లోజర్లను తయారు చేస్తారు. టాటా యాపిల్ ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా 100 రిటైల్ అవుట్లెట్లను ప్రారంభిస్తామని కూడా ప్రకటించింది. యాపిల్ ఇటీవలి సంవత్సరాలలో భారతదేశంలో ఉత్పత్తిని పెంచుతోంది. దాదాపు 7 శాతం ఐఫోన్లను మన దగ్గరే తయారు చేస్తోంది. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నది.
ప్రస్తుతం, భారతదేశంలో అమ్ముడయ్యే అన్ని ఐఫోన్ 15 యూనిట్లు దేశీయంగా తయారవుతున్నాయి. ఇతర మార్కెట్లకు కూడా ఎగుమతి అవుతున్నాయి. యాపిల్కు అత్యంత ముఖ్యమైన తయారీ భాగస్వాములలో ఒకటైన చైనాకు చెందిన ఫాక్స్కాన్ భారతదేశంలోనూ భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇది కర్ణాటకలో ఏటా 20 మిలియన్ ఐఫోన్లను ఉత్పత్తి చేయగల కొత్త ప్లాంట్ను నిర్మిస్తున్నది.