
- ఆందోళనకు దిగిన పేరెంట్స్
- టీచర్ను సస్పెండ్ చేసిన డీఈవో
కల్లూరు, వెలుగు : స్టూడెంట్లు ఎంత చెప్పినా జుట్టు కట్ చేసుకొని రావడం లేదంటూ ఓ టీచరే ఏకంగా 15 మంది స్టూడెంట్ల జుట్టు కత్తిరించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. కల్లూరు మండల పరిధిలోని పేరువంచ జడ్పీ హైస్కూల్లో దిగుమర్తి శిరీష ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తోంది. స్కూల్లో చదువుతున్న 15 మంది స్టూడెంట్లకు జుట్టు కట్ చేసుకొని రావాలంటూ పలుమార్లు సూచించింది. అయినా వారు పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన టీచర్ శనివారం తానే స్టూడెంట్ల జుట్టును అడ్డదిడ్డంగా కట్ చేసింది. తర్వాత బార్బర్ షాప్కి వెళ్లి నీట్గా కట్ చేసుకొని రావాలని పంపించింది.
దీంతో స్టూడెంట్లు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. వారు స్కూల్కు చేరుకొని విషయాన్ని తమ దృష్టికి తీసుకురావాలి గానీ, ఇలా జుట్టు కట్ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీచర్పై చర్యలు తీసుకోవాలంటూ స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. అయితే స్టూడెంట్లకు క్రమశిక్షణ నేర్పే ఉద్దేశంతోనే అలా చేశానని, వేరే ఉద్దేశం ఏమీ లేదని టీచర్ చెప్పినట్లు తల్లిదండ్రులు తెలిపారు. విషయం పోలీసులు స్కూల్కు వెళ్లి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. కాగా విషయం తెలుసుకున్న డీఈవో సోమశేఖరశర్మ టీచర్ శిరీషను సస్పెండ్ చేస్తూ ఆర్డర్స్ జారీ చేశారు.