ఈ మధ్య కురిసిన వానలకి వీధులన్నీ చెరువులయ్యాయి. అడుగు తీసి బయటపెట్టలేని పరిస్థితి. ఇట్ల ఉన్నప్పుడు పిలగాండ్లు బడికి ఎట్ల పోతరు? కానీ, కటిహార్ జిల్లా పిల్లలకి క్లాసులు మిస్ అవుతామనే బెంగ లేదు. ఎందుకంటే బడే వాళ్ల దగ్గరికి వచ్చింది. వాళ్లు పడవ బడిలో పాఠాలు వింటున్నారు. బీహార్లోని కటిహార్ జిల్లాకు చెందిన కుందన్ కుమార్ సాహా, పంకజ్ కుమార్ సాహా, రవీంద్ర మండల్ అనే యువకులు పడవలో వెళ్లి మరీ ప్రైమరీ, హైస్కూల్ పిల్లలకి పాఠాలు చెబుతున్నారు. పోస్ట్గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్లు ఉళ్లో ఒకటి నుంచి పదో క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్కి ఫ్రీగా కోచింగ్ ఇస్తుంటారు కూడా. ఈ మధ్య పడిన వర్షాలకు నదులు, వాగులు పొంగాయి. దాంతో అక్కడి గవర్నమెంట్ స్కూల్ మూతపడింది. మారుమూల ప్రాంతంలోని పేద కుటుంబాల పిల్లలు క్లాసులు మిస్ అవడం చూశారు వీళ్లు. ఎలాగైనా ఆ పిల్లలకి క్లాసులు చెప్పాలని టీచర్స్డే రోజున నిర్ణయం తీసుకున్నారు ఈ ముగ్గురు. స్థానికంగా చేపలు పట్టేవాళ్ల దగ్గర మూడు బోట్లు కిరాయికి తీసుకున్నారు. ఉదయాన్నే పడవలో పిల్లలు ఉండే చోటకి వెళ్తారు. పడవని చెట్టుకి తాడుతో కట్టేస్తారు. అందులో పిల్లల్ని కూర్చోబెట్టి ఒకసారి ఇరవై మందికి పైగా పిల్లలకి పాఠాలు చెబుతారు. పిల్లల సందేహాలు తీరుస్తారు. అంతేకాకుండా ఆ పిల్లలకి పెన్నులు, నోట్బుక్స్, పుస్తకాలు కూడా ఫ్రీగా ఇస్తున్నారు.
అప్పటి వరకూ పడవే బడి
‘‘వరద ప్రాంతంలో ఉండే పిల్లలు బడికి రాలేరు. ఒక్కోసారి 6 నెలల దాకా వరద నీళ్లు అలానే ఉంటాయి. ఆ పిల్లలు క్లాసులు మిస్ అవడం మాకు ఇష్టం లేదు. వాళ్లకి పాఠాలు చెప్పేందుకు పడవలో వెళ్లడం తప్ప మాకు వేరే ఆప్షన్ లేదు. వరద నీళ్లు తగ్గిపోయేంత వరకు పడవలో వెళ్లి పాఠాలు చెబుతూనే ఉంటాం”అని చెబుతున్నడు పంకజ్ కుమార్.