ISRO: పీఎస్ఎల్వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక సమస్య..

ISRO: పీఎస్ఎల్వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక సమస్య..

జాతీయ భద్రత, వ్యవసాయ, అటవీ పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ, పట్టణ ప్రణాళిక వంటి అంశాలతో పటిష్ఠ నిఘా వ్యవస్థ కోసం ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ61 ప్రయోగంలో (PSLV- C61) సాంకేతిక సమస్య తలెత్తింది. రెందు దశలు విజయవంతంగా దాటిన తర్వాత వాహక నౌకలో టెక్నికల్ సమస్య తలెత్తినట్లు ఇస్రో ఛైర్మన్ నారాయణన్ ప్రకటించారు. 

నిఘా వ్యవస్థను పఠిష్టం చేసే EOS-09 శాటిలైట్ ను మోసుకెళ్లే PSLV- C61 ప్రయోగం విజయవంతంగా ప్రారంభమైనప్పటికీ.. మూడవ దశలో సాంకేతిక సమస్య ఏర్పడింది. ప్రయోగ కేంద్రం నుంచి రాకెట్ బయలుదేరిన 17 నిమిషాల అనంతరం నిర్దేశిత కక్ష్యలోకి చేర్చాల్సి ఉంది.

ఆదివారం (మే 18) ఉదయం 5.59 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ61 మిషన్‌ను ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) ప్రయోగించింది. శ్రీహరికోటలో ఉన్న సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. అయితే ప్రయోగం మొదలైన కొద్దిసేపటికే రాకెట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. మూడో స్టేజీలో మొదట మోటార్‌ సరిగానే స్టార్ట్‌ అయినప్పటికీ ఆ వెంటనే టెక్నికల్‌ ఇష్యూ వచ్చింది. దీంతో ప్రయోగం ఇంకా పూర్తికాలేదని, అన్నీ విశ్లేషించాక పూర్తి వివరాలు చెబుతామని ఇస్రో చైర్మన్‌ నారాయణ వెల్లడించారు. 

పీఎస్ఎల్వీ సీ 61 ప్రయోగంలో మొత్తం.. 1696 కిలోల బరువు ఉన్న ఈఓఎస్-09 రాడార్ ఇమేజింగ్ శాటిలైట్‌ను 500 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి పంపాలన్నదే ఈ ప్రయోగ లక్ష్యం. సీ-బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ అమర్చిన ఈ శాటిలైట్.. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో, తక్కువ వెలుతురులో కూడా భూ హై-రిజల్యూషన్ ఫోటోలను తీసేలా రూపొందించింది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే సరిహద్దులపై మరింత పటిష్టమైన నిఘా వేయవచ్చని ఇస్రో వర్గాలు చెబుతున్నాయి.