
- మేం కరువుతో అల్లాడుతుంటే ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తున్నది
- బ్రజేశ్కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు
- జీబీ లింక్ పేరిట పెన్నాకూ నీటిని తన్నుకుపోయేలా ఏపీ కుట్రలు
- ఇప్పటికే ఆ ప్రాజెక్టుకు వందల కోట్ల ఖర్చు
- పెన్నా బేసిన్లోనే 344 టీఎంసీల నీటి లభ్యత
- కానీ, కృష్ణా నుంచే ఏటా 330 టీఎంసీలు ఏపీ తీసుకెళ్తున్నది
- ఇన్సైడ్ బేసిన్కు ఒక్క చుక్క కూడా తీసుకెళ్లట్లే
హైదరాబాద్, వెలుగు: ఓవైపు తెలంగాణ కరువుతో అల్లాడుతుంటే.. ఏపీ మాత్రం కృష్ణా నుంచి ఔట్సైడ్ బేసిన్కు నీళ్లను తన్నుకుపోతున్నదని ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదించింది. ఇన్సైడ్ బేసిన్కే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉన్నా.. ఔట్సైడ్ బేసిన్లోని పెన్నా బేసిన్కు ఏపీ కృష్ణా నీళ్లను దోచుకెళ్లిపోతున్నదని ఆక్షేపించింది. ఇప్పటికే కృష్ణా నీళ్లను తరలిస్తున్న ఏపీ.. ఇప్పుడు గోదావరి బనకచర్ల (జీబీ) లింక్ పేరిట పోలవరం నుంచి కూడా పెన్నా బేసిన్కు నీటిని తరలించేందుకు కుట్రలు చేస్తున్నదని తెలిపింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై ఏపీ వందల కోట్లు ఖర్చు చేసిందని, బొల్లాపల్లి వద్ద 150 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ను నిర్మించి పెన్నాకు నీటిని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నదని పేర్కొన్నది.
దీనిపై కేడబ్ల్యూడీటీ –2లో ఫిర్యాదు కూడా చేశామని తెలిపింది. సోమవారం బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ (కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ –2) ముందు తెలంగాణ తరఫున సీనియర్ అడ్వకేట్ సి.ఎస్. వైద్యనాథన్ వాదనలు వినిపించారు. కృష్ణా బేసిన్లో ఉన్న తెలంగాణ ఓవైపు కరువుతో అల్లాడుతుంటే.. నీళ్లు దండిగా ఉన్న పెన్నా బేసిన్కు ఏపీ నీళ్లు తరలించుకుపోవడమేంటని ప్రశ్నించారు. ఏపీకి 40 రివర్ బేసిన్లు ఉన్నాయని, వాటితో ఆ రాష్ట్రానికి పుష్కలంగా నీటి లభ్యత ఉంటుందని చెప్పారు. కానీ, నీటి లభ్యత తక్కువగా ఉండే కృష్ణా బేసిన్ నుంచి.. నీటి లభ్యత మంచిగా ఉండే పెన్నాబేసిన్కు ఏటా 330 టీఎంసీలను తన్నుకుపోతున్నదని వాదించారు.
కృష్ణా నీళ్లు కాకుండా పెన్నా బేసిన్లో 344 టీఎంసీల నీటి లభ్యత ఉందని పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగా 360 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లను ఏపీ నిర్మించుకున్నదని ట్రిబ్యునల్కు వివరించారు. ఏపీ అడ్డదారిలో నీటిని తరలించుకుపోతుండడంతో పాలమూరు– రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వంటి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు.
మళ్లీ కొత్తగా కేటాయింపులు చేయాల్సిందే..
సెక్షన్ –3లోని ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ను ట్రిబ్యునల్కు తెలంగాణ వివరించింది. ఏపీ, తెలంగాణల మధ్య ప్రత్యేకంగా కేటాయింపులేవీ లేవని, రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులను చేసే బాధ్యత ట్రిబ్యునల్కే కేంద్రం అప్పగించిందని గుర్తు చేసింది. అందుకు తగ్గట్టుగానే తొలుత కేడబ్ల్యూడీటీ– 1, ఆ తర్వాత కేడబ్ల్యూడీటీ– 2 రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులను చేసిందని తెలిపింది. అయితే, 2 రాష్ట్రాల మధ్య అంతర్గతంగా జరిగిన ఒప్పందాల మేరకు నీటి కేటాయింపులను కొనసాగించాలంటూ ఏపీ అడుగుతున్నదని పేర్కొన్నది. అలా జరిగితే తమకు నష్టం జరుగుతుందని ట్రిబ్యునల్కు వివరించింది.
మళ్లీ మొదటి నుంచి రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ జరగాలని స్పష్టం చేసింది. జాతీయ, అంతర్జాతీయ క్రైటీరియా ప్రకారం నీటి కేటాయింపులు జరగాలని తెలిపింది. మరోవైపు తెలంగాణలో ప్రతిరోజూ తలసరి నీటి లభ్యత 422 క్యూబిక్ మీటర్లుండగా.. ఏపీ, తెలంగాణ తలసరి నీటి వాడకం అంతకన్నా ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది. కాగా, తెలంగాణ తరఫున సీఎస్ వైద్యనాథన్తో పాటు ఇతర అడ్వకేట్లు, ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్ అధికారులు వాదనల్లో పాల్గొనగా.. ఏపీ నుంచి సీనియర్ అడ్వకేట్ జయదీప్ గుప్తా, ఆ రాష్ట్ర ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్ అధికారులు పాల్గొన్నారు.
ఇన్సైడ్ బేసిన్కు వద్దంట
కృష్ణా నది నుంచి ఏపీ ఇన్సైడ్ బేసిన్కు నీటిని అడగడం లేదని, ఒక్క చుక్క కూడా పరివాహక ప్రాంతంలో వాడుకోవడం లేదని తెలంగాణ వాదించింది. ఇప్పుడు ఏపీ అడుగుతున్నదంతా ఔట్సైడ్ బేసిన్లో ఉన్న పెన్నా బేసిన్కు తీసుకెళ్లేందుకేనని ట్రిబ్యునల్దృష్టికి తెచ్చింది. అయితే, తాము మాత్రం న్యాయంగా తమకు రావాల్సిన వాటాలో ఇన్సైడ్ బేసిన్కే తీసుకెళ్తున్నామని పేర్కొన్నది. కొత్త ఆయకట్టులోని తడి భూములకు కాకుండా.. నీళ్లు లేకుండా పంటలు ఎండుతున్న కరువు, బీడు భూములకే నీళ్లు ఇవ్వాలంటున్నామని తెలిపింది. కాగా, పరివాహకప్రాంతంలోని జనాభా, ఆయకట్టు ఆధారంగానే నీటి పంపకాలు జరగాలని తెలంగాణ వాదించింది. ఈ లెక్కలపై ట్రిబ్యునల్ కొన్ని డౌట్లు అడగడంతో అడ్వకేట్ వాటిని క్లారిఫై చేశారు.