సూర్యాపేట, వెలుగు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించి, వాటిని బలోపేతం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ములకలపల్లి రాములు, మట్టిపల్లి సైదులు డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హాస్పిటళ్లలో నెలకొన్న సమస్యలపై సర్వే నిర్వహించారు. సర్వేలో బయటపడిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
హాస్పిటళ్లలో కనీస సౌకర్యాలు కల్పించడంల లేదని, పేదల వైద్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఎక్స్ రే చేయకపోవడంతో ప్రైవేట్ సెంటర్లకు వెళ్లి పరీక్షలు నిర్వహించుకోవాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. చాలా హాస్పిటళ్లలో డాక్టర్స్, స్టాఫ్ నర్స్, ఏఎన్ఎంలు, అటెండర్స్, డేటా ఎంట్రీ ఆఫీసర్స్, ల్యాబ్, టెస్టులు వంటి సౌకర్యాలు లేవన్నారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్కు, డీఎంహెచ్వో ఆఫీసులో వినతిపత్రం సమర్పించారు.
