
- 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రం సాధించిన ఘనత
- అనేక రంగాల్లో తెలంగాణకు ఫస్ట్ ప్లేస్: సీఎం రేవంత్రెడ్డి
- తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మార్చుకుందాం
- మౌలిక సదుపాయాల కోసం డ్రైపోర్టును ఏర్పాటు చేస్తం
- మరిన్ని అంతర్జాతీయ కార్యక్రమాలకు హైదరాబాద్ వేదికవుతుందని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఆర్థిక వృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగ కల్పనతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని, లక్షకు పైగా ఉద్యోగాలు కల్పించిందన్నారు. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశం, ఇతర దేశాల్లో పారిశ్రామికవేత్తలతో చర్చల ద్వారా తెలంగాణ పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు.
నానక్రామ్గూడలో సోనాటా సాఫ్ట్వేర్ కొత్త ఆఫీస్ను సోమవారం సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, హైదరాబాద్ను అద్భుత నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ఈ ప్రయత్నంలో అందరూ భాగస్వాములు కావాలని, హైదరాబాద్ అభివృద్ధిని ప్రపంచానికి చాటాలని సీఎం కోరారు. హైదరాబాద్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు కేంద్రంగా ఎదుగుతున్నదని.. ముఖ్యంగా సాఫ్ట్వేర్, లైఫ్ సైన్సెస్, ఏఐ డేటా సెంటర్లలో హైదరాబాద్ ముందుందని తెలిపారు. మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో వంటి అంతర్జాతీయ ఐటీ కంపెనీలు హైదరాబాద్లో తమ కార్యకలాపాలను విస్తరించాయని పేర్కొన్నారు.
హైదరాబాద్కు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తున్నదని, ప్రస్తుతం మిస్ వరల్డ్ పోటీలు ఇక్కడే జరుగుతున్నాయని ఆయన అన్నారు. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. అనేక రంగాల్లో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ నివేదికల ప్రకారం పోలీసింగ్, చట్ట అమలు, ద్రవ్యోల్బణ నియంత్రణ, ఉద్యోగ కల్పన, పన్నుల వసూళ్లలో రాష్ట్రం అగ్రగామిగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల ద్వారా 66 లక్షల మందికి పైగా మహిళలకు సహాయం చేస్తున్నదని, ఇది దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ ఫండింగ్ అండ్ మెంటరింగ్ కార్యక్రమం అని సీఎం రేవంత్ వివరించారు.
రాజీవ్ యువ వికాసం కార్యక్రమం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ట్రాన్స్జెండర్ వాలంటీర్లను ట్రాఫిక్ పోలీస్ బృందంలో చేర్చిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. తెలంగాణలో మౌలిక సదుపాయాల కోసం డ్రైపోర్టును ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లోని పోర్టుకు అనుసంధానం చేస్తామన్నారు. హైదరాబాద్ సమీపంలో ‘ఫ్యూచర్ సిటీ’ని నిర్మిస్తున్నామని, అందులో ప్రత్యేకంగా ‘ఏఐ సిటీ’ ఉంటుందని చెప్పారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు.
త్వరలో ఏఐ వర్సిటీ: మంత్రి శ్రీధర్ బాబు
ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణను ఏఐ కేంద్రంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగానే ‘ఏఐ సిటీ’కి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఈ సిటీలో భాగస్వామ్యం అయ్యేందుకు మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఆసక్తి కనబరిచాయని వెల్లడించారు. ఏఐలో ప్రపంచ స్థాయి నిపుణులను తయారు చేసేందుకు త్వరలోనే ఏఐ యూనివర్సిటీని ప్రారంభిస్తామన్నారు.
పౌర సేవలను ఏఐతో అనుసంధానించి ప్రజల ముంగిటకు చేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆయన తెలిపారు. ఆన్లైన్లో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అనుబంధంగా డిజిటల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సోనాటా సాఫ్ట్వేర్ ఎండీ సమీర్ ధీర్ తదితరులు పాల్గొన్నారు.