జీసీ లింక్లో కర్నాటకకు నీళ్లెట్లిస్తరు?..ఎన్డబ్ల్యూడీఏని ప్రశ్నించిన తెలంగాణ

జీసీ లింక్లో కర్నాటకకు నీళ్లెట్లిస్తరు?..ఎన్డబ్ల్యూడీఏని ప్రశ్నించిన తెలంగాణ
  • ఈ నెల 1న జరిగిన జనరల్​ బాడీ మీటింగ్​ మినిట్స్​ విడుదల

హైదరాబాద్, వెలుగు: గోదావరి కావేరి లింక్​ను చేపడితే.. తరలించే నీళ్లలో తమకు సగం వాటా ఇవ్వాలని నేషనల్​ వాటర్​ డెవలప్​ మెంట్​ ఏజెన్సీ (ఎన్​డబ్ల్యూడీఏ)ని తెలంగాణ డిమాండ్​ చేసింది. ఈ నెల 1న ఎన్​డబ్ల్యూడీఏ చైర్మన్​ వీఎల్​ కాంతారావు నేతృత్వంలో నిర్వహించిన జనరల్​ బాడీ మీటింగ్​కు సంబంధించిన మినిట్స్​ను ఎన్​డబ్ల్యూడీఏ మంగళవారం విడుదల చేసింది. ఎన్​డబ్ల్యూడీఏ ఆరో కన్సల్టెన్సీ మీటింగ్​లో భాగంగా తమ డిమాండ్లను రాతపూర్వకంగా సమర్పించామని ఈఎన్​సీ జనరల్​ అంజద్​ హుస్సేన్​ తెలిపారని మినిట్స్​లో ఎన్​డబ్ల్యూడీఏ వెల్లడించింది.

 అసలు లింక్​లో భాగమేకాని కర్నాటకకు నీటి వాటాను ఎలా ఇస్తారని ఈఎన్​సీ ప్రశ్నించారు. కర్నాటకకు నీళ్ల వాటా ఇవ్వొద్దన్నారు. లింక్​ను తమ భూభాగం (తెలంగాణ) నుంచే చేపడుతున్నారు కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ.. లింక్​లో భాగంగా తరలించే 148 టీఎంసీల్లో 74 టీఎంసీలు ఇవ్వాలని స్పష్టం చేశారు. లింక్​ ప్రాజెక్టుకు సూత్రప్రాయంగా తాము అంగీకరిస్తున్నామని, అదే సమయంలో తమ డిమాండ్లకు కేంద్రం కూడా ఒప్పుకోవాలని తేల్చి చెప్పారు.

 గోదావరిపై నిర్మించిన పెండింగ్​ ప్రాజెక్టులకు అనుమతులివ్వాలని డిమాండ్​ చేశారు. 74 టీఎంసీలకు తోడు.. వరద జలాల్లో 200 టీఎంసీలను వాడుకునేందుకు అనుమతులివ్వాలన్నారు. కృష్ణ బేసిన్​లో రెండు రిజర్వాయర్లను నిర్మించి ఇవ్వాలన్నారు. కాగా, ఏపీ చేపడుతున్న నాలుగు ఇంట్రా లింక్​ ప్రాజెక్టులైన చింతలపూడి లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీమ్, బాబు జగ్జీవన్​ రామ్​ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వైఎస్సార్​ పల్నాడు డ్రాట్​ మిటిగేషన్​ ప్రాజెక్ట్, గుండ్రేవుల రిజర్వాయర్లతో తెలంగాణకు నష్టం జరుగుతుందని, వాటికి అనుమతులివ్వొద్దని తేల్చి చెప్పారు. ఈ డిమాండ్లను ఇప్పటికే ఆగస్టు 22న జరిగిన మీటింగ్​లో రాతపూర్వకంగా ఇచ్చామని, వాటిని నెరవేర్చాలని స్పష్టం చేశారు.    

మిగులు జలాల్లేవ్..​లింక్​ ఎట్ల సాధ్యం?: ఏపీ

గోదావరిలో మిగులు జలాలు లేవని, అలాంటప్పుడు జీసీ లింక్​ ఎలా సాధ్యమవుతుందని ఎన్​డబ్ల్యూడీఏని ఏపీ ప్రశ్నించింది. జీసీ లింక్​లో తరలించే 148 టీఎంసీలు చత్తీస్​గఢ్​లోని ఇంద్రావతి సబ్​బేసిన్​ నుంచి వచ్చేవని, అది కూడా తాత్కాలికమేనని పేర్కొంది. ఆ తర్వాత హిమాలయాల నుంచి ఎప్పటికోగాని రాని నీళ్లతో భర్తీ చేసే ఆలోచన ఉన్నదని తెలిపింది. అలాంటప్పుడు జీసీ లింక్​ ఎలా సాధ్యమవుతుందని ఏపీ కొర్రీలు పెట్టింది. 

అది తాత్కాలిక ఒప్పందమే అయినా.. సభ్య రాష్ట్రాలకు అదనపు జలాలను కేటాయించేందుకు ఇప్పటికే అంగీకరించామని ఎన్​డబ్ల్యూడీఏ డైరెక్టర్​ జనరల్​ గుర్తు చేశారు. జీసీ లింక్​లో తమకూ నీటి వాటాలు ఇవ్వాలని, ఇంట్రా లింక్​ ప్రాజెక్టులకు అంగీకరించాలని మహారాష్ట్ర డిమాండ్​ చేసింది.