హైదరాబాద్, వెలుగు: తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ గా మార్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ (టీజీజీడీఏ) సీఎం రేవంత్ రెడ్డిని కోరింది. సోమవారం మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి డాక్టర్లు సీఎంను కలిశారు. వైద్య ఆరోగ్య శాఖలోని మూడు విభాగాల్లో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
టీవీవీపీని డైరెక్టరేట్గా మారిస్తేనే జీతాల విషయంలో ఇబ్బందులు తొలగి, పరిపాలన బాగుంటుందని డాక్టర్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. డీహెచ్ పరిధిలోని డాక్టర్లకు టైమ్ బౌండ్ ప్రమోషన్లు ఇవ్వాలని, డీఎంహెచ్వో పోస్టులకు నష్టం జరగకుండా జీవో 142ను సవరించాలని యూనియన్ లీడర్లు డిమాండ్ చేశారు.
రూరల్, ట్రైబల్ ఏరియాల్లో పనిచేసే ఫ్యాకల్టీకి స్పెషల్ అలవెన్సులు, నిమ్స్ తరహాలో ఈఎల్ ఎన్క్యాష్మెంట్ సదుపాయం కల్పించాలన్నారు. ఈ సమస్యలను విన్న సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని డాక్టర్ యూనియన్ నేతలు వెల్లడించారు. ఈ భేటీలో టీజీజీడీఏ అధ్యక్షుడు డాక్టర్ నరహరి, సెక్రటరీ జనరల్ డాక్టర్ లాలు ప్రసాద్ రాథోడ్, డాక్టర్ రౌఫ్, డాక్టర్ దీన్ దయాల్ తదితరులు పాల్గొన్నారు.
