ఇంటర్ బోర్డు అధికారులపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం

ఇంటర్ బోర్డు అధికారులపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం

ఇంటర్ బోర్డు అధికారులపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్ బోర్డు అధికారులతో ఇంటర్ విద్యపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ కళాశాలల్లో చేపట్టిన మౌలిక సదుపాయాల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు మంత్రి సబిత ఆదేశాలు జారీ చేశారు. కళాశాలల్లో అవసరమైన నూతన భవనాలు, అదనపు గదులు, టాయిలెట్ల నిర్మాణం కోసం రూ. 60 కోట్లు మంజూరు చేసినా సకాలంలో పనులు పూర్తి చేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం ఆరంభం నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించినా పూర్తి కాకపోవడంతో ప్రతి వారం పనుల పురోగతిపై సమీక్షించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్‌ను ఆదేశించారు. 

కళాశాలల నిర్వహణ అవసరాల కోసం..ల్యాబ్‌ల ఆధునికీకరణ వంటి పనుల కోసం మరో రూ.4 .43 కోట్లు మంజూరు చేశామని, పనులు వెంటనే చేపట్టాలని మంత్రి సబిత ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు ఇంకా పాఠ్యపుస్తకాలు అందకపోవడంపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుస్తకాలను వివిధ జిల్లాలకు సరఫరా చేయడానికి కేవలం ఆర్టీసీపైనే ఆధారపడకుండా.. ప్రైవేట్‌ ఆపరేటర్ల సహాయంతో శుక్రవారం (జులై 21)  నాటికి చేరేవిధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

దేశంలోనే ప్రప్రథమంగా ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యను ఉచితంగా అందిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశాల సంఖ్య తగ్గిందనే విషయంలో ఆరోపణలు వస్తున్నాయని, ఇది నిజం కాదని మంత్రి సబిత వివరణ ఇచ్చారు. 119 జ్యోతిరావు పూలే పాఠశాలలను, 38 కేజీబీవీలను, 2 గిరిజన గురుకులాలను ఇంటర్మీడియేట్ వరకు అప్ గ్రేడ్ చేశామని చెప్పారు. ప్రవేశాల తుది గడువు ఇంకా పూర్తి కాలేదని, గడువు ముగిసే నాటికి గత సంవత్సరంతో పోలిస్తే అధిక ప్రవేశాలు జరుగుతాయన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ వంటి జిల్లాల్లో ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడంపై అధికారుల అసహనం వ్యక్తం చేశారు. మారుమూల జిల్లాల్లో అత్యధిక శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తుండగా.. అన్ని వనరులు ఉండి కూడా ఈ మూడు జిల్లాలు వెనుకబడి ఉండటం సమర్థనీయం కాదన్నారు.  ఇప్పటి నుంచే ప్రత్యేక శ్రద్ధ వహించి ఉత్తమ ఫలితాలు సాధించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.