హైదరాబాద్, వెలుగు: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలో ఔట్సోర్సింగ్విధానంలో పనిచేస్తున్న 1,037 మంది పంచాయతీ సెక్రటరీల సేవలను మరో ఏడాదిపాటు కొనసాగించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా ప్రతినెలా రూ.19,500 చొప్పున జీతం చెల్లిస్తున్నారు. రెగ్యులర్ పోస్టులు భర్తీ అయ్యే వరకు ఈ నియామకాలు కొనసాగుతాయని ఉత్తర్వులో పేర్కొన్నారు.
రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సేవల్లో ఉన్న మొత్తం పంచాయతీ సెక్రటరీల సంఖ్య జిల్లాలోని జీపీల సంఖ్యను మించరాదనే నిబంధనను విధించారు. కాగా, ఔట్సోర్సింగ్ సెక్రటరీల సేవలను మరో ఏడాదిపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నందుకు తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి మధుసూదన్రెడ్డి, శ్రీనివాస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
