ఇంజినీరింగ్​ కొలువులకు ప్రిపరేషన్ ప్లాన్

ఇంజినీరింగ్​ కొలువులకు ప్రిపరేషన్ ప్లాన్

తెలంగాణ ప్రభుత్వం వివిధ శాఖల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్​ ఇంజినీరింగ్​ ఉద్యోగాలకు నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. పరీక్షలు జనవరి లేదా ఫిబ్రవరిలో ఉండే అవకాశం ఉంది. ఈ సమయంలో విజయం సాధించాలంటే ఎలాంటి ప్రిపరేషన్​ ప్లాన్​ సిద్ధం చేసుకోవాలో చూద్దాం.

సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, అగ్రికల్చర్‌‌ పట్టభద్రులకు మొత్తం 1540 ఏఈఈ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. పోటీ పరీక్షలో నెగ్గి కొలువు సాధించినవారికి మొదటి నెల జీతం సుమారుగా రూ.70,000 వరకు ఉంటుంది. గేట్, ఇండియన్​ ఇంజినీరింగ్​ సర్వీస్​ లాంటి ఉద్యోగాలకు ప్రిపేర్​ అయ్యే అభ్యర్థులకు ఏఈఈగా ఉద్యోగం సాధించడం ఈజీగా ఉంటుంది. సబ్జెక్ట్ నాలెడ్జ్​తో పాటు జనరల్​ స్టడీస్​ మీద పట్టు ఉన్నప్పుడే ఇంజినీరింగ్​ కొలువు సులువుగా కొట్టవచ్చు. 

గేట్​ ప్రిపేర్​ అయ్యేవారికి బెనిఫిట్​​: గేట్​ ప్రిపేర్​ అవుతున్న వారితో పాటు ఇండియన్​ ఇంజినీరింగ్​ సర్వీస్​ కోసం ముందుగానే కోచింగ్​ తీసుకున్నవారు, లాంగ్ టర్మ్​ ప్రిపరేషన్​లో ఉన్నవారికి ఏఈఈ నోటిఫికేషన్​ మంచి అవకాశం. టీచింగ్​ ఫీల్డ్​లో ఫ్యాకల్టీలుగా పని చేస్తున్న వారికి ఇంజినీరింగ్​ సబ్జెక్టులో మంచి మార్కులు స్కోర్​ చేయవచ్చు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్​ ఇంజినీర్స్​లో సివిల్​ ఇంజినీరింగ్​ సబ్జెక్టులు దాదాపు 10 వరకు ఉంటాయి.  వీటన్నింటి మీద ఫోకస్​ చేయకుండా ఎక్కువ మార్కులు వచ్చే సబ్జెక్ట్ ముందే గుర్తించి, ప్రిపరేషన్​ ప్రారంభించాలి. 

సివిల్​ అండ్​ మెకానికల్​ కామన్​ సబ్జెక్టులు: ఏఈఈకి సివిల్​ ఇంజినీరింగ్​ అభ్యర్థులు సాధించినంత సులువుగా మెకానికల్​ ఇంజినీరింగ్​లో మార్కులు సాధించలేము, కాని రెండింటిలో కొన్ని సబ్జెక్టులు కామన్​గా ఉంటాయి. మెకానికల్​ ఇంజినీరింగ్​ సబ్జెక్టులలో ముఖ్యంగా అప్లైడ్​ మెకానిక్స్​, థర్మల్ సైన్స్​ సెక్షన్ల మీద ఫోకస్​ చేయాలి. సివిల్​ అండ్​ మెకానికల్​ ఇంజినీరింగ్​లో కొన్ని సబ్జెక్టులు కామన్​గా ఉంటాయి. ఉదాహరణకు ప్లూయిడ్​ మెకానిక్స్​. సివిల్​ ఇంజినీరింగ్​ వారికి కొన్ని సబ్జెక్టులు సులభంగా ఉంటాయి. కాని వాటి నుంచి ప్రశ్నలు రావు. మెకానికల్​ ఇంజినీరింగ్​లో కొన్ని సబ్జెక్టుల నుంచి అధిక ప్రశ్నలు వస్తాయి. కాని సబ్జెక్ట్​ టఫ్​గా ఉంటుంది. 

సబ్జెక్ట్​పై పట్టు ఉండాలి:  ఏఈఈ పేపర్​ గేట్​ లేదా ఇండియన్​ ఇంజినీరింగ్​ సర్వీస్​ పరీక్ష స్థాయిలో ఉంటుంది. ఏఈఈ ఎగ్జామ్​లో ఒక ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి. బీటెక్​, ఎంటెక్​, పీహెచ్​డీ చదివిన వారికి ఏఈఈ పరీక్ష కొంతవరకు సులువుగా ఉండడానికి ఆస్కారం ఉంది. ఏఈఈ ఉద్యోగం సాధించాలంటే ఇంజినీరింగ్​ సబ్జెక్టుల మీద పూర్తి పట్టు ఉండాలి. మొత్తం 450 మార్కుల పేపర్​లో ఇంజినీరింగ్​ సబ్జెక్టులకు 300 మార్కుల వెయిటేజీ, జనరల్​ స్టడీస్​కు 150 మార్కులు ఉంటాయి.  సోషల్​ సైన్సెస్​ వారికి ‘నెట్​’ పరీక్ష ఎలాంటిదో ఇంజినీరింగ్​ వారికి గేట్​ పరీక్ష అలాంటిదే.

ప్రీవియస్ పేపర్స్​ ప్రాక్టీస్​:  పూర్తిగా సబ్జెక్ట్​ మీద కమాండింగ్​ వచ్చిన తర్వాత ప్రీవియస్​​ గేట్, ఐఈఎస్ పరీక్ష పేపర్లు సాధన చేయాలి. సివిల్​ ఇంజినీరింగ్​ వారికి కుర్మి రచయిత పుస్తకాలు, ఎలక్ట్రికల్​ ఇంజినీరింగ్​ వారికి జే.బీ.గుప్త, ఎలక్ట్రానిక్​ అండ్​ కమ్యూనికేషన్​ ఇంజినీరింగ్​ వారికి కెనడీ పుస్తకం ముఖ్యమైనవి.  గత ప్రశ్నపత్రాల్లో సాలిడ్‌‌ మెకానిక్స్, బిల్డింగ్‌‌ మెటీరియల్స్, ఆర్‌‌సీసీ, జియో టెక్నికల్‌‌ ఇంజినీరింగ్, ఫ్లూయిడ్‌‌ మెకానిక్స్‌‌ అండ్‌‌ హెచ్‌‌ఎం, ఇరిగేషన్‌‌ ఇంజినీరింగ్, ఎన్విరాన్‌‌మెంటల్‌‌ ఇంజినీరింగ్, హైవే ఇంజినీరింగ్‌‌లో ఎక్కువ మార్కులకు ప్రశ్నలు ఇచ్చారు. ఈ సబ్జెక్టులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే మంచి మార్కులు సాధించొచ్చు. తక్కువ వెయిటేజీ ఉన్న సబ్జెక్టులో బేసిక్స్​ ప్రాక్టీస్​ చేయాలి.

తెలంగాణ, ఇండియా హిస్టరీ: తెలంగాణ సంస్కృతి, కళలు, సంప్రదాయాలు, వాస్తుశైలి అనే అంశం నుంచి సుమారు 10 ప్రశ్నలు వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం నుంచి 8 నుంచి 10 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. 1969లో ఉద్యమ తొలిదశ ప్రారంభం, టీఆర్‌‌ఎస్‌‌ ఆవిర్బావం తర్వాత కేసీఆర్‌‌, జేఏసీ పాత్ర, ఉద్యమ సమయంలో గేయాలు, రచనలు, వ్యక్తులు, సంస్థలపై అవగాహన అవసరం. ఆధునిక భారత చరిత్ర, జాతీయ ఉద్యమంలో ఐరోపా వారి రాక నుంచి 1947 వరకు జరిగిన ప్రధాన సంఘటనలు ముఖ్యం. మైసూర్‌‌ యుద్ధాలు, కర్ణాటక యుద్ధాలు, గాంధీయుగం, జాతీయ ఉద్యమ సంస్థలు, పత్రికలు, గవర్నర్‌‌ జనరల్స్, వైశ్రాయ్‌‌ల కాలంలో జరిగిన సంఘటనలపై అవగాహన పెంచుకోవాలి.

జనరల్‌‌ సైన్స్ అండ్​ టెక్నాలజీ: ఈ అంశం నుంచి 15-నుంచి 20 ప్రశ్నలు వస్తున్నాయి సాంకేతికతలో భారత్‌‌ సాధించిన విజయాలు ముఖ్యంగా ఇస్రో సాధించిన విజయాలు, పీఎస్‌‌ఎల్‌‌వీ/జీఎస్‌‌ఎల్‌‌వీ, లాంచ్‌‌ వెహికల్స్, కృత్రిమ ఉపగ్రహాలు, సూపర్‌‌ ఫాస్ట్‌‌ కంప్యూటర్‌‌ల మీద ప్రశ్నలు వస్తాయి. విటమిన్లు, మినరల్స్, వ్యాధులు, కరోనా, వర్తమాన శాస్త్రం, సాంకేతిక అంశాలు మొదలైనవీ ముఖ్యమే.

పాలిటీ, గవర్నెన్స్‌‌: పాలిటీని కరెంట్​ ఎఫైర్స్​కు అనుసంధానం చేసుకుంటూ చదవాలి. నేషనల్‌‌ జ్యుడీషియల్‌‌ కమిషనర్‌‌ పరిపాలనలో వస్తున్న మార్పులు, వ్యక్తులు, విధానాల మీద దృష్టి కేంద్రీకరించాలి. ముఖ్యంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, డిజిటల్‌‌ పరిపాలన, నీతి ఆయోగ్, గవర్నెన్స్‌‌ పాత్ర, ముఖ్యమైన ప్రకటనలు, రాజ్యాంగ సవరణలు, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మీద ఎక్కువ ఫోకస్​ చేయాలి. 

పర్యావరణ పరిరక్షణ, విపత్తు నిర్వహణ: ఇందులో 6- నుంచి 10 ప్రశ్నలు వస్తున్నాయి. ముఖ్యంగా గ్లోబల్‌‌ వార్మింగ్‌‌ కారణాలు, ఓజోన్‌‌ పొర నశించడం, కాలుష్య కారకాలు, ఆమ్ల వర్షాలు, ప్రభావం మీద ప్రశ్నలు వస్తాయి. విపత్తు నిర్వహణలో కరవు, తుపానులు, భూకంపాలు, సునామీ, నిర్వహణ చట్టం నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. 

జనరల్‌‌ స్టడీస్ ప్రిపరేషన్ ప్లాన్​ 

జనరల్‌‌ స్టడీస్‌‌లో తెలంగాణ రాష్ట్ర భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక, ప్రణాళికలకు సంబంధించిన సిలబస్‌‌ కలిపి ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయ వర్తమాన అంశాల కోసం నిత్యం న్యూస్​ పేపర్స్​ చదువుతూ నోట్స్ రాసుకోవాలి.  తెలంగాణ ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ విజయాలు, అవార్డులు, ప్రభుత్వ పాలసీలు, స్థానికంగా జరిగిన సదస్సులు, సమావేశాలు ప్రధానంగా అడిగే అవకాశం ఉంటుంది.  2015లో నిర్వహించిన ఏఈఈ పరీక్షలో ప్రశ్నలు సరళంగా, సూటిగా ఇచ్చారు. కానీ 2017, 2018 ఏఈఈ పరీక్ష పేపర్లలో కఠినమైన, విశ్లేషణాత్మకమైన ప్రశ్నలు ఇచ్చారు. అభ్యర్థులు జనరల్​ స్టడీస్​ కు తక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ఇంజినీరింగ్​ సబ్జెక్ట్​తో పాటు వీటి మీద ఫోకస్​ చేస్తేనే జాబ్​ కొట్టవచ్చు. ఇంజినీరింగ్​ సబ్జెక్టులో 250 మార్కులు వచ్చే వారికి, జనరల్ స్టడీస్​లో కొంతవరకు అడ్వాన్​టేజ్​ ఉంటుంది. జనరల్​ ఇంగ్లీష్, రీజనింగ్​ సబ్జెక్టుల నుంచి 40 మార్కులు వచ్చే అవకాశం ఉంది. జనరల్​ స్టడీస్​ తప్పనిసరిగా క్వాలిఫై అవ్వాలి. లేకపోతే ఇంజినీరింగ్​ సబ్జెక్టులో మంచి మార్కులు వచ్చినా వృథా అవుతుంది.  

నోటిఫికేషన్​

ఆన్‌‌లైన్‌‌ దరఖాస్తులు సెప్టెంబర్​ 22 నుంచి ప్రారంభమవుతాయి. అక్టోబర్​ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు: బీఈ/బీటెక్‌‌ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, అగ్రికల్చర్‌‌), తత్సమాన డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్హులు. వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

వెబ్‌‌సైట్‌‌: www.tspsc.gov.in
పృథ్వీ కుమార్​ చౌహాన్​
పృథ్వీస్​ IAS స్టడీ సర్కిల్​