బోగస్ పింఛన్లకు చెక్! .. లబ్ధిదారులకు ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి

బోగస్ పింఛన్లకు చెక్! .. లబ్ధిదారులకు ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి
  • రేపటి నుంచే నమోదు ప్రక్రియ ప్రారంభం
  • పకడ్బందీగా చేపట్టాలని డీఆర్డీవోలకు సెర్ప్ ఆదేశం
  • పోస్ట్ ఆఫీస్​లో బోర్డులపై పింఛన్​ దారుల జాబితా

హైదరాబాద్, వెలుగు: బోగస్ పింఛన్లకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై పింఛన్ దారులకు ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అర్హులకే పింఛన్లు అందేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో భాగంగా ఈ నెల 29 నుంచి పింఛన్ దారుల కోసం ఫేస్ రికగ్నిషన్ నమోదు ప్రక్రియ ప్రారంభించాలని సెర్ప్ (పేదరిక నిర్మూలన సంస్థ) నుంచి డీఆర్డీవోలకు (జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు) ఆదేశాలు అందాయి. దీని కోసం రూపొందించిన యాప్​లో ఫొటో అప్​లోడ్ చేసేందుకు అవసరమైన స్మార్ట్​ఫోన్లు, వేలిముద్రల పరికరాలు, ఇతర ఎక్విప్​మెంట్లను బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు అందించాలని సూచించింది. ఒకవేళ ఈ పరికరాలు అందకపోతే పోస్ట్ మాస్టర్లు, పంచాయతీ కార్యదర్శులు తమ సొంత ఫోన్లలో యాప్‌‌‌‌‌‌‌‌ను ఇన్‌‌‌‌‌‌‌‌స్టాల్ చేసుకుని పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ విధానం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్ని పోస్ట్ ఆఫీస్​ల్లో ‘చేయూత’ లబ్ధిదారుల వివరాలను బోర్డుపై ప్రదర్శించాలని ఆదేశించింది. దీనిద్వారా బోగస్ పింఛన్లకు అడ్డుకట్ట వేయొచ్చని ప్రభుత్వం భావిస్తున్నది.

రాష్ట్రంలో 42.96 లక్షల మందికి పింఛన్లు

రాష్ట్ర వ్యాప్తంగా 42.67 లక్షల మంది పింఛన్ దారులు ఉన్నారు. వీరి కోసం రూ.14,628.91 కోట్లు బడ్జెట్ లో కేటాయించారు. ప్రతినెలా రూ.1000.47 కోట్లు పింఛన్ దారులకు ప్రభుత్వం చెల్లిస్తున్నది. పోస్టల్ శాఖ ద్వారా బయోమెట్రిక్ ప్రామాణికంగా 22.72 లక్షలు (53 శాతం), బ్యాంకుల ద్వారా 19.95 లక్షలు (47 శాతం) పంపిణీ చేస్తున్నది. వృద్ధాప్య పింఛన్లు 15.25 లక్షలు, వితంతువులు 15.26 లక్షలు, దివ్యాంగులు 4.92 లక్షలు, గీత కార్మికులు 63 వేలు, చేనేత 36 వేలు, హెచ్ఐవీ బాధితులు 35 వేలు, డయాలసిస్ రోగులు 8 వేలపైగా, ఫైలేరియా రోగులు 18 వేలు, బీడీ కార్మికులు 4.23 లక్షలు, ఒంటరి మహిళలు 1.41 లక్షలు, బీడీ టేకేదార్లు 4 వేల మంది పింఛన్ పొందుతున్నారు. కాగా, రాష్ట్రంలో అత్యధికంగా 23.39 లక్షల మంది బీసీలకు పింఛన్ అందజేస్తున్నారు. ఎస్సీలు 6.76 లక్షల మంది, ఎస్టీలు 3.47 లక్షల మంది, మైనార్టీలు 2.84 లక్షల మంది, ఓసీలు 6.21 లక్షల మంది పింఛన్ పొందుతున్నారు. 28.05 లక్షల మంది మహిళలు పింఛన్ పొందుతున్నారు. పోస్టల్ శాఖతో బయోమెట్రిక్ ప్రామాణికంగా 53 శాతం పెన్షన్ దారులకు ప్రతి నెలా పింఛన్ అందజేస్తున్నారు. కాగా, కొత్తగా పింఛన్ కోసం సుమారు 24.84 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే లబ్ధిదారుల సంఖ్య 69 లక్షలకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

వేలిముద్రలతో సమస్యలు..

ప్రతి నెలా పింఛన్ ఇచ్చే టైమ్​లో వృద్ధాప్యం కారణంగా వేలి ముద్రలు పడకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఫింగర్ ప్రింట్లు పడని వారికి పంచాయతీ సెక్రటరీలు, పోస్టుమాస్టర్‌‌‌‌‌‌‌‌, బిల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్లు ధ్రువీకరించిన తర్వాతే పింఛన్ ఇస్తున్నారు. ప్రత్యేక యాప్‌‌‌‌‌‌‌‌లో లబ్ధిదారుల వివరాలు నమోదు చేసిన తర్వాత ప్రతినెలా వారి ఫొటో తీసి యాప్‌‌‌‌‌‌‌‌లో పెట్టిన తర్వాతే పెన్షన్‌‌‌‌‌‌‌‌ జారీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అంతేగాకుండా కొన్ని చోట్ల పింఛన్​దారులు మృతిచెందినా.. వారి పేర్లు జాబితా నుంచి తొలగించడం లేదు. దీంతో వారి పేరుపై ఇంకా పింఛన్లు పొందుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ యాప్ అందుబాటులోకి వస్తే వృద్ధులకు పింఛన్ కష్టాలు తొలగనున్నాయి.