
- మున్సిపాలిటీ లు, కార్పొరేషన్ల లో అవకాశం
- ట్యాక్స్ వడ్డీ/పెనాల్టీ పై 90 శాతం రాయితీ ప్రకటించిన ప్రభుత్వం
- మరో ఐదు రోజుల్లో ముగియనున్న గడువు
- ఇప్పటికే వడ్డీ తో చెల్లించిన వారికి వచ్చే ఏడాది పన్నుల్లో అడ్జస్ట్ మెంట్
హైదరాబాద్, వెలుగు: మున్సిపాలిటీ లు, కార్పొరేషన్ల లో ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లకు ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్)ను ప్రకటించింది. ట్యాక్స్ వడ్డీ/పెనాల్టీ పై 90 శాతం రాయితీ ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే వడ్డీతో చెల్లించిన వారికి వచ్చే ఏడాది పన్నుల్లో అడ్జస్ట్ మెంట్ చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇటీవల జీహెచ్ఎంసీలో ఓటీఎస్ అవకాశం ఇవ్వగా తాజాగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూడా అమలు చేయాలని వినతులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మొత్తం రూ. 1,500 కోట్లు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు కావాల్సి ఉండగా.. మంగళవారం నాటికి రూ. 950 కోట్లు వసూలయినట్లు అధికారులు చెబుతున్నారు. మరో5 రోజులు గడువు ఉండటంతో ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.